Gold Price Prediction 2025
Gold Prices : బంగారం ధరలు భారీగా పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి ధరలు సామాన్యునికి అందనంత ఎత్తుకు ఎగబాకనున్నాయి. గోల్డ్మన్ సాచ్స్, యూబిఎస్ బంగారం ధరల భారీగా పెరనుగనున్నట్టు అంచనాను పెంచాయి.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో 2025 ఏడాది చివరిలోగా 24 క్యారెట్ (99.9 ఫ్యూర్ గోల్డ్ ) 10 గ్రాముల పసిడి ధర రూ.1.25 లక్షలకు చేరే అవకాశం ఉందని అమెరికాకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది.
పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం వచ్చే ప్రమాదం పెరగడం వంటి కారణాల వల్ల ఇప్పటికే బంగారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఇటీవలి ధరల హెచ్చుతగ్గులు, స్థూల ఆర్థిక సంకేతాలు బంగారం ధర బుల్లిష్ ట్రెండ్కు దారితీస్తున్నాయని గోల్డ్మన్ సాచ్స్, యూబిఎస్ తెలిపాయి. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పెరగడం, సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరగడం, పరిమిత సరఫరా సౌలభ్యం బంగారం ధరల పెరుగదలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
అమెరికా వాణిజ్య సుంకాల చర్యల కారణంగా ఈ నెల ప్రారంభంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టి.. ఆ తర్వాత భారీగా పెరిగాయి. భారతీయ మార్కెట్లో బంగారం ధర లక్ష మార్క్ చేరువగా వచ్చింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఔన్స్ 4,500 డాలర్లు ధర ఉండవచ్చునని గోల్డ్మన్ సాచ్స్ చెబుతోంది. ఇదే జరిగితే దేశీయంగా తులం బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరడం ఖాయమని అంచనా వేసింది.
యూబీఎస్ (UBS) అంచనాలివే :
యూబీఎస్ కూడా బంగారం ధరలపై అంచనాలను వెల్లడించింది. ఈ ఏడాదిలో బంగారం ధరలు ఔన్సుకు 3,500 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది. పెరుగుతున్న సుంకాల అనిశ్చితి, బలహీనమైన ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ నష్టాలు కారణాలుగా తెలిపింది. మార్కెట్లో విస్తృత స్థాయిలో బంగారానికి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ధరల పెరుగుదలకు ఇంకా అవకాశం ఉందని యూబీఎస్ తెలిపింది.
భారత్లో బంగారం ధరలు :
భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.96,450కి పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, జూన్ 5 బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.93,288 వద్ద స్వల్పంగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వాల్యూ 23 శాతం పెరిగి దేశీయంగా తులం బంగారం ధర రూ.20 వేలకు పైగా పెరిగింది.
బంగారం ధరలపై ట్రేడ్ వార్ ఎఫెక్ట్ :
ట్రేడ్ వార్ మరింత ఉదృతమైతే.. బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు మాత్రం అంచనా వేస్తున్నారు. గోల్డ్మన్ సాచ్స్ సైతం బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
మదుపరులు సైతం పెట్టుబడుల కోసం పసిడి వైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. టారిఫ్ల నుంచి చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజులపాటు రిలీఫ్ అందించడంతో ఈక్విటీ మార్కెట్లు సైతం నెమ్మదిగా తేరుకుంటున్నాయి.
పసిడి ధరలపై 2025లో గోల్డ్మన్ సాచ్స్ అంచనాలను మూడుసార్లు సవరించింది. తొలుత ఔన్స్ 3,300 డాలర్లుగా అంచనా వేయగా ఆపై 3,700 డాలర్లు, ఇప్పుడు 4,500 డాలర్లు అంటూ అంచనా వేసింది.