కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ మంగళవారం(ఫిబ్రవరి 19,2019)న పచ్చజెండా ఊపింది. భారత్లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విలువను 2025 నాటికి 400 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే ఈ పాలసీ లక్ష్యంగా కేంద్రం కేబినెట్ ఆమోదించింది.. ప్రస్తుతం వీటి విలువ 80 బిలియన్ డాలర్ల సమీపంలో ఉంది. కొత్త పాలసీ వల్ల కోటి మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీలో భాగంగా రుణాలపై వడ్డీ సబ్సిడీ అందివ్వనుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కూడా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్లాంటు, మిషనరీ ఏర్పాటుకు తీసుకున్న రుణాలకు (75 శాతం వరకు మొత్తానికి) కేంద్రమే బ్యాంకులకు పూచీకత్తు ఉంటుంది. దీని కోసం రూ.100 కోట్ల వరకు ఫండ్ ఏర్పాటు చేస్తుంది.
ఎలక్ట్రానిక్స్ ప్లాంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయమందించేలా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్షరింగ్ క్లస్టర్ స్కీమ్ సవరణను ప్రతిపాదించింది. దీంతో చిప్స్ ఐపీలు, చిప్స్ విడిభాగాలు తక్కువ ధరలకు అందుబాటులోకి రావొచ్చు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా ప్రస్తుత ప్లాంటు విస్తరణకు సంబంధించి ప్రత్యక్ష పన్ను ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది.