Cars prices decreased
GST Rates Cars prices decreased : కొత్త కారు కొంటున్నారా..? అయితే, మీకు గుడ్న్యూస్. కార్ల ధరలు భారీగా తగ్గాయి. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులుచేస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు కంపెనీల కార్ల ధరలు లక్షల్లో తగ్గాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో పలు సంస్కరణలు చేసిన విషయం తెలిసిందే. జీఎస్టీ శ్లాబుల్లో కీలక మార్పులు చేసింది. 28శాతం, 12శాతం శ్లాబులను తొలగిస్తున్నట్లు జీఎస్టీ మండలి సెప్టెంబర్ 3న ప్రకటించింది. ఇక నుంచి 18శాతం, 5శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులను తీసుకొస్తుంది. పెట్రోల్, డీజిల్తో నడిచే చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. కేవలం.. లగ్జరీ వాహనాలు, హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. వీటిపై 40శాతం జీఎస్టీ అమల్లో ఉండనుంది.
జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను తగ్గించింది. తమ మొత్తం వాహన శ్రేణి ధరలను రూ.2.4లక్షల వరకు తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆదివారం ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం.. వెర్నా మోడల్ ధర రూ.60,640 తగ్గనుండగా.. ప్రీమియం ఎస్యూవీ టక్సన్ ధర రూ.2.4లక్షల వరకు తగ్గనుంది. ఈ కొత్త ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు.. టాటా మోటార్స్ తన కమర్షియల్ వెహికల్స్ రేట్లను రూ.30వేల నుంచి రూ.4.65లక్షల వరకు తగ్గిస్తామని పేర్కొంది.
జీఎస్టీ రేట్లు తగ్గడంతో తమ మొత్తం వాణిజ్య వాహన శ్రేణి ధరలను రూ.30వేల నుంచి రూ.4.65 లక్షల మేర తగ్గిస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే ప్రయాణికుల కార్ల ధరలను రూ.1.55 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సవరించిన ధరలను టాటా మోటార్స్ ఈ నెల 22 నుంచి అమల్లోకి తీసుకునుంది.
మరోవైపు.. దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్ కూడా కీలక ప్రకటనలు చేశాయి. ఎం అండ్ ఎం ప్యాసంజర్ వెహికిల్స్ పై గరిష్ఠంగా రూ. 1.56లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. మహీంద్రా బొలెరోపై రూ.1.27లక్షలు తగ్గనుంది. మహీంద్రా XUV 3XO (పెట్రోల్) ధర ఏకంగా రూ. 1.40 లక్షలు తగ్గనుంది. ఇదే డీజిల్ మోడల్పై రూ. 1.56 లక్షలు తగ్గనుంది.