హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ నేటి నుంచి ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రారంభించనుంది. ఈ ఐపీవో అక్టోబరు 17న ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ.1865-1960 మధ్య ధర ఉంటుందని తెలిపింది.
ఈ ఐపీవో ద్వారా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గరిష్ఠంగా రూ.27,870 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. దేశంలో ఇదే అతిపెద్ద ఐపీవో. ఇప్పటివరకు ఎల్ఐసీనే రూ.21 వేల కోట్ల నిధుల సమీకరణతో అతిపెద్ద ఐపీఓగా ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 14నే సబ్స్క్రిప్షన్ విండోను ఓపెన్ చేయనున్నారు.
మొత్తం 14,21,94,700 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయిస్తారు. ఆ కంపెనీ మొత్తం 1.6 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువతో ఐపీవోకు రానుంది. అలాగే, తాజాషేర్లను జారీ చేయదు. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ (రూ.13,720) నుంచి కొనుగోళ్లు మొదలు పెట్టవచ్చు. ఒక్కో ఇన్వెస్టర్ గరిష్ఠంగా 14 లాట్లు కొనవచ్చు.
హ్యుందాయ్ సంస్థ సౌత్ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ. దాని అనుబంధ సంస్థనే హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్. దేశంలో 1996 నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలో మారుతీ సుజుకీ అనంతరం అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా హ్యుందాయ్ ఉంది. హ్యుందాయ్ భారత్లో 13 మోడళ్లను అమ్ముతోంది.
కాగా, హ్యుందాయ్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) స్థిరంగా క్షీణిస్తోంది. ఇటీవల జీఎంపీ ప్రతి షేరుకు రూ. 65గా ఉంది. ధరల బ్యాండ్ గరిష్ఠ ముగింపులో పెట్టుబడిదారులకు 3 శాతం పొటెన్షియల్ లిస్టింగ్ లాభాన్ని సూచిస్తుంది. జీఎంపీ చాలా ఎక్కువగా ఉంది. వారాంతానికి ముందు ఒక్కో షేరుకు రూ.150-175 కోట్లతో ఉంది.
అయితే గత కొన్ని రోజులుగా అది టూ డిజిట్ ఫిగర్కు పడిపోయింది. ఇంతకు ముందు అక్టోబర్లో జీఎంపీ రూ.500 రూపాయలకు చేరుకుంది. ఇష్యూ అధికారికంగా ప్రకటించినప్పుడు దాదాపు రూ.350-375కు చేరుకుంది. భారీ ఐపీఓలు విఫలం కావడానికి ముఖ్య కారణం అందులో ఎక్కువ భాగం ఆఫర్ ఫర్ సేల్ ఉండడమేనని నిపుణులు అంటున్నారు. హ్యుందాయ్ సైతం 100 శాతం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తోంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్ సమయంలో భారీ స్థాయిలో ప్రతిఫలం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు.