×
Ad

World’s Largest Office Building : గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన సూరత్ వజ్రాల భవనం…రేపు మోదీ ప్రారంభోత్సవం

ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ‘‘సూరత్ డైమండ్ బోర్స్’’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. 3400 కోట్ల రూపాయల వ్యయంతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బర్స్ వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది....

  • Published On : December 16, 2023 / 05:10 AM IST

World's Largest Office Building

World’s Largest Office Building : ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ‘‘సూరత్ డైమండ్ బోర్స్’’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. 3400 కోట్ల రూపాయల వ్యయంతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బర్స్ వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టడ్ భవనం. ఈ భవనంలో 4,500 ఇంటర్‌కనెక్టడ్ కార్యాలయాలు ఉన్నాయి. కార్యాలయ భవనం పెంటగాన్ కంటే పెద్దది.

వజ్రాల వ్యాపారానికి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌

సూరత్ భవనం దేశంలోనే అతిపెద్ద కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4,200 మంది వ్యాపారులు ఉండే సామర్థ్యం ఉంది. విదేశీ వ్యాపారులు పాలిష్ చేసిన వజ్రాలను కొనుగోలు చేయడానికి సూరత్‌కు రానున్నారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వజ్రాల కొనుగోలుదారులు సూరత్‌లో వ్యాపారం చేయడానికి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ను పొందారు. ఈ భవనం వల్ల1.5 లక్షల మందికి వాణిజ్య సౌకర్యంతో ఉపాధి లభించనుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయ భవనం

గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ఉన్న పెంటగాన్‌ను ఇప్పుడు సూరత్ డైమండ్ బర్స్ అధిగమించిందని ఎక్స్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టు పెట్టారు. ‘‘సూరత్ డైమండ్ బోర్స్ సూరత్ వజ్రాల పరిశ్రమ వృద్ధిని ప్రదర్శిస్తుంది. ఇది భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలకు కేంద్రంగా ఉపయోగపడుతుంది, మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది,ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది’’ అని మోదీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఈ ఏడాది ఆగస్టులో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 35.54 ఎకరాల ప్లాట్‌లో నిర్మించిన ఈ మెగాస్ట్రక్చర్‌లో 9 గ్రౌండ్ టవర్లు, 15 అంతస్తులు ఉన్నాయి, 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం ర్యాంకింగ్ ఉంది.

ALSO READ : Andhra Pradesh Politics : వైసీపీలో మార్పులు, టీడీపీలో చేరికలు.. ఏపీలో వేడెక్కిన రాజకీయం

ఈ అతిపెద్ద భవన ప్రారంభ కార్యక్రమానికి దేశ, ప్రపంచం నలుమూలల నుంచి 70,000 మందికి ఆహ్వానాలు పంపించారు.గత కొన్ని వారాలుగా అనేక వజ్రాల వ్యాపార సంస్థలు ఇప్పటికే SDBలోని తమ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. కట్టర్లు, పాలిషర్లు మరియు వ్యాపారులను కలుపుకొని 65,000 మంది వజ్రాల నిపుణులకు అనుకూలమైన హబ్‌గా ఈ భవనం లక్ష్యంగా ఉంది. ఈ భవన నిర్మాణ పనులు 2015 వ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.

ALSO READ : CM Jagan : ఫిబ్ర‌వ‌రిలోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌..!

ఈ భవనంలో ఆఫీసులతో పాటు, డైమండ్ బోర్స్ క్యాంపస్‌లో సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్‌లు, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, ట్రైనింగ్ సెంటర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా, రెస్టారెంట్లు, క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.