Paytm Payments Bank : పేటీఎంకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. పేమెంట్స్ బ్యాంకు సర్వీసులపై నిషేధం.. ఎప్పటినుంచంటే?
Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) సర్వీసులపై ఆర్బీఐ నిషేధం విధించింది. దీనికి సంబంధించి పరిమితులను విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన కొన్ని సర్వీసులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
Paytm Payments Bank : భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కొన్ని పరిమితులను విధించింది. కొత్త కస్టమర్ను చేర్చుకోవద్దని ప్లాట్ఫారమ్ను ఆదేశించింది. వచ్చే ఫిబ్రవరి 29 తర్వాత ఇప్పటికే ఉన్న కస్టమర్లు వారి సేవింగ్ అకౌంట్ల నుంచి డబ్బు పంపడం లేదా స్వీకరించకుండా పరిమితం చేసింది.
ఇకపై పేటీఎం యూజర్లు ఈ తేదీ తర్వాత నుంచి పేటీఎం అకౌంట్లకు లింక్ చేసిన వ్యాలెట్లు, ఫాస్ట్ట్యాగ్స్, డిపాజిట్లు, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్ అప్ చేసుకునేందుకు అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. గత 2022 మార్చిలోనే ఆర్బీఐ కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ను ఆదేశించింది.
అయితే, పేటీఎం యూజర్లు తమ అకౌంట్లలోని మిగిలిన బ్యాలెన్స్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చునని ఆర్బీఐ తెలిపింది. పేటీఎం పేరంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ అకౌంట్లను కూడా ఆర్బీఐ రద్దు చేసింది. పేటీఎం యూజర్లు తమ అకౌంట్ల నుంచి సేవింగ్స్ కరెంట్తో సహా పరిమితం లేకుండా బ్యాలెన్స్ ఉపయోగించుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
యూపీఐ పేమెంట్లపై కొత్త ఆంక్షలు వర్తించవు :
సమగ్ర సిస్టమ్ ఆడిట్ రిపోర్టు, ఎక్స్టర్నల్ ఆడిటర్ల వెరిఫైడ్ రిపోర్టు తర్వాత ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో అవకతవకలతో పాటు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు రిపోర్టు తెలిపింది. పేటీఎం బ్యాంక్ సర్వీసులపై మానిటరింగ్ అవసరమని ఆర్బీఐ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆరోపణల నేపథ్యంలో విచారణ మొదలైందని తెలిపింది. ఆర్బీఐ విధించిన కొత్త ఆంక్షలు పేటీఎం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)పై ఎలాంటి ప్రభావం ఉండదని వినియోగదారులు గమనించాలి.
ఆర్బీఐ చర్యలపై ఇప్పటివరకూ కంపెనీ లేదా వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ నుంచి ఎలాంటి స్పందించలేదు. అయితే, పేటీఎం బ్యాంక్తో లింక్ చేసినవి మినహా పేటీఎం యాప్ యథావిధిగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 29 వరకు లేదా అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ అయిపోయే వరకు మాత్రమే సర్వీసులు పనిచేస్తాయి.
వందలాది మంది ఉద్యోగుల తొలగింపు :
కస్టమర్లు తమ అకౌంట్ ఇతర బ్యాంకులకు లింక్ చేసినంత వరకు డిజిటల్ పేమెంట్ ఆప్షన్గా పేటీఎంను వినియోగించవచ్చు. డిసెంబరులో, వన్97 కమ్యూనికేషన్ ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ప్రారంభించింది. ఆ తర్వాత కంపెనీ వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపర్చనున్నట్టు పేటీఎం సంస్థ పేర్కొంది.