Telangana govt earns windfall income from hyderabad real estate
Hyderabad Real Estate : తెలంగాణలో రియల్టీ రంగం ఫుల్ జోష్లో ఉంది. చిన్న చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ వరకు రియల్టీ క్రయవిక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి ధరలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు బాగుంటే ఎంత దూరమైనా వెళ్లి కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు బయ్యర్స్. దీంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మొత్తం రియల్టీ బిజినెస్లో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.
90 శాతం వరకు ఆదాయం ఎక్కడి నుంచంటే? :
80 నుంచి 90శాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. లే అవుట్లలోని ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇల్లు.. చిన్న, పెద్ద అపార్ట్మెంట్, టవర్స్లోని ఫ్లాట్స్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. ఈ రంగంలో ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ సర్కార్కు వచ్చే ఆదాయ మార్గాల్లో రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఒకటి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. గతేడాది ఆయా జిల్లాల్లో క్రయ విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.
Read Also : Hyderabad Development : ఎన్ఆర్ఐల చూపు.. హైదరాబాద్ వైపు.. దేశ విదేశాలను ఆకర్షిస్తున్న మహానగరం..!
ఈ జిల్లాల్లో ప్రాపర్టీలకు ఫుల్ డిమాండ్ :
రాష్ట్రంలో గత ఏడాది 89వేల 302 ఫ్లాట్స్ అమ్ముడు పోగా.. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలో 3 వేల 428 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 83వేల 318 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. దీంతో ప్రభుత్వానికి ఈ జిల్లాల నుంచి 3వేల 406 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దీంతో ఈ జిల్లాల్లో ప్రాపర్టీలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక గత ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో ఇండిపెండెంట్ ఇళ్ల అమ్మకాలు కూడా భారీగా నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇండిపెండెట్ ప్రాపర్టీలు 99 వేల 702 యూనిట్లు అమ్ముడు పోగా.. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలో 2 వేల 364 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 50వేల ప్రాపర్టీలు అమ్ముడు పోగా ప్రభుత్వ ఖజానాకు 18వందల 27 కోట్లు జమ అయ్యాయి.
రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఎంతంటే? :
ఇక ఓపెన్ ప్లాట్ల విషయానికి వస్తే… గత ఏడాది 4 లక్షల 63వేల 416 ఓపెన్ ప్లాట్లు అమ్ముడు పోగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా 2వేల 766 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో జీహెచ్ఎంసీతో పాటు సరౌండింగ్ జిల్లాల వాటా 18వందల కోట్ల రూపాయలు. ఇలా గణాంకాలన్నీ పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్తో పాటు సరౌండింగ్ డిస్ట్రిక్స్ నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోందని తెలుస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిర్మాణాలకు కావాల్సిన ముడి సరుకుల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. అందులో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాలను కల్పిస్తే… రాబోయే రోజుల్లో ఈ రంగం నుంచి ఆదాయం మరిన్ని రెట్లు పెరుగుతుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
మూడు పువ్వులు ఆరు కాయలుగా :
కోవిడ్ సమయంలో మినహాయిస్తే గత పదేళ్లలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడుపువ్వులు ఆరు కాయలుగా ఉంది. ఏటా ఈ రంగం చక్కని వృద్ధిని నమోదు చేసింది. 2014-15లో ప్రాపర్టీల క్రయ విక్రయాల ద్వారా 2వేల 746 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం 14 వేల 291 కోట్ల రూపాయలకు ఎగబాకింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం ఆదాయంలో కల్పతరువుగా మారింది.