Hyderabad : హైదరాబాద్లో ఒక న్యాయవాది తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి(44) ఎయిర్ఫోర్స్లో సార్జంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎయిర్ఫోర్స్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకుని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా శివారెడ్డి భార్య నుంచి విడాకులు తీసుకుని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బాగ్లింగంపల్లిలో అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవిస్తున్నారు. ఈరోజు ఉదయం కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. ఉదయం టీ తాగి తన అపార్ట్మెంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకున్నారు.
శివారెడ్డి సోదరి మహేశ్వరి చాలాసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయే సరికి కవాడీగూడలో ఉంటున్న తన స్నేహితురాలు లక్ష్మీభవానీకి ఫోన్ చేసి, తన సోదరుడి వద్దకు వెళ్లి చూసి…. ఫోన్ చేయించమని చెప్పి పంపించింది. ఆమె తన తల్లితో కలిసి శివారెడ్డి ఉంటున్న ఫ్లాట్ కు వచ్చి చూడగా తలుపు గడియ పెట్టి ఉంది.
వారు వాచ్ మెన్ సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా శివారెడ్డి లోపల విగత జీవిగా పడిఉన్నారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. భార్యతో విడాకులు…ఒంటరిగా ఉండటం… ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే శివారెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంచవచ్చని తెలుస్తోంది.
Also Read : Nirav Modi: నీరవ్ మోదీకి మరోసారి షాకిచ్చిన ఈడీ.. ఆ దేశంలోని రూ.253కోట్ల విలువైన ఆస్తులు సీజ్