×
Ad

Jharkhand Train Accident : జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 12 మంది దుర్మరణం!

Jharkhand Train Accident : జార్ఖండ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతిచెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Published On : February 29, 2024 / 12:56 AM IST

At least 12 killed, many hurt after being hit by train in Jharkhand's Jamtara

Jharkhand Train Accident : జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జంతారా-కర్మతాండ్ దగ్గర బుధవారం ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. కాలాజహరియా రైల్వే క్రాసింగ్ వద్ద ఆగి ఉన్న రైలు నుంచి కొందరు ప్రయాణికులు కిందికి దిగారు.

ప్రయాణికులు పట్టాలు దాటుతున్న అదే సమయంలో మరో రైలు దూసుకొచ్చి వారిని ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు ఢీకొనడంతో ప్రయాణికులంతా గాల్లోకి ఎగిరిపడ్డారని, చాలామంది అక్కడిక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది :
స్థానికులు సమాచారం అందించగానే పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలు, గాయపడినవారి కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం చీకటిగా ఉండటంతో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

విద్యాసాగర్, కసితార్ మధ్య ప్రయాణిస్తున్న రైలు నంబర్ 12254 సాయంత్రం 7 గంటలకు అసన్‌సోల్ డివిజన్‌లో ఆగినప్పుడు ఈ సంఘటన జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన జాగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తూర్పు రైల్వే సీపీఆర్వో కౌశిక్ మిత్రా తెలిపారు.