Bank Robbery : శ్రీకాళహస్తిలో ప్రైవేట్ బ్యాంకులో అర్ధరాత్రి భారీ దోపిడీ..!
Bank Robbery : శ్రీకాళహస్తిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బ్యాంకులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పిన్ కేర్ ప్రైవేటు బ్యాంకులో దొంగలు చొరబడ్డారు.
- Sreehari A
- Published On : May 27, 2022 / 09:01 AM IST
Bank Robbery In Srikalahasti Private Bank, Police Hunt For Robbers
Bank Robbery : శ్రీకాళహస్తిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బ్యాంకులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పిన్ కేర్ ప్రైవేటు బ్యాంకులో దొంగలు చొరబడ్డారు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకు లోపలికి ప్రవేశించారు. ముఖానికి మాస్క్లు ధరించి రూ.85 లక్షల ఖరీదైన నగలు, ఐదు లక్షల నగదు చోరీ చేశారు. మహిళా ఉద్యోగులను బెదిరించి బంధించారు. లాకర్ రూమ్ తాళాలను దుండగులు లాక్కున్నారు. బ్యాంకు సిబ్బందిని బెదిరించి లాకర్లు ఓపెన్ చేయించారు. లాకర్లలో ఉన్న రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
Bank Robbery In Srikalahasti Private Bank, Police Hunt For Robbers (1)
అక్కడి నుంచి పరారైన దుండగులు బ్యాంకులోని సీసీ కెమెరా రికార్డులను కూడా పట్టుకెళ్లారని బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన శ్రీకాళహస్త వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. దోపిడీకి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కత్తితో బెదిరించి.. చేతులు, కాళ్లు కట్టేశారు : బ్యాంకు మేనేజర్
శ్రీకాళహస్తిలోని ప్రైవేటు బ్యాంకులో చోరీకి సంబంధించి ఆ బ్యాంకు మేనేజర్ స్రవంతి మీడియాతో మాట్లాడారు. బ్యాంకులో చోరీ జరిగిన విధానాన్ని ఆమె వివరించారు. గురువారం రాత్రి 11 గంటల వరకు బ్యాంక్లో కొన్ని పనులు చేసుకుంటున్నామని చెప్పారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. తనకు కత్తి చూపించి బెదిరించారని, చేతులు కాళ్లు కట్టేసారని మేనేజర్ స్రవంతి తెలిపింది. నోటిలో క్లాత్ ఉంచి మాట్లాడకుండా చేశారని, లాకర్ తాళాలు ఇవ్వమని బెదిరించారని చెప్పింది. వెంటనే తాను భయంతో తాళాలు ఇచ్చేశానని, దుండగులు బ్యాంకు లాకర్లలోని నగలు, డబ్బు ఎత్తుకెళ్లిపోయారని చెప్పింది. తొలుత ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో చొరబడ్డారని, ఒకరు బయట ఉండగా.. వారంతా హిందీ, తమిళ్ మాట్లాడుతున్నారని బ్యాంకు మేనేజర్ స్రవంతి మీడియాకు తెలిపింది.
దోపిడీ జరిగిన తీరుపై అనుమానాలున్నాయి.. జిల్లా ఎస్పీ ఆరా..
బ్యాంకులో చోరీకి సంబంధించి సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకును ఎస్పీ పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరు గురించి ఎస్పీ ఆరా తీశారు. నిందితులను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. బ్యాంకులో చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దుండగులు బ్యాంకులోకి చొరబడిన సమయంలో బ్యాంకు మేనేజర్, మరో బ్యాంక్ ఉద్యోగి ఉన్నారని చెప్పారు.
మరో ఉద్యోగి బయటకు వెళ్లిన తర్వాతే ముగ్గురు దుండగులు బ్యాంకులోకి చొరపడ్డారు. మహిళా మేనేజర్ స్రవంతి చేతులు, కాళ్లు కట్టేసి చోరీకి పాల్పడినట్లు చెబుతున్నారు. దుండగులు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. నిందితుల ఆచూకీ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ఫిన్ కేర్ ప్రధాన కార్యాలయం నుంచి సీసీ ఫుటేజ్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై కొన్ని అనుమానాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
Read Also : Wedding Tragedy : పెళ్లివేడుకలో విషాదం.. వరుడు డ్రైవింగ్.. దూసుకెళ్లిన కారు..!
