Fake Babas In Vikarabad : మీ పల్లెల్లో, మీ వీధుల్లో ఎవరెవరు తిరుగుతున్నారో గమనిస్తున్నారా? ముసుగులు వేసుకుని వస్తున్న మోసగాళ్లను గుర్తు పడుతున్నారా? గ్రామాల్లోకి దొంగలు చొరబడ్డారు. మూఢ నమ్మకాల పేరుతో, పిచ్చి పిచ్చి వేషధారణల్లో మాయ మాటలతో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్లు, ఇల్లు గుల్లవ్వడం ఖాయం. ఇలాంటి ఘటనే వికారాబాద్ లో జరిగింది.
అమాయకులే టార్గెట్.. పూజలు, హోమాలు, దోష నివారణల పేరుతో డబ్బు, నగలు లూటీ
ప్రజల నమ్మకాలు, బలహీనతలు ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారికి కొదవలేదు. అమాయకులే వారి టార్గెట్. పూజలు, హోమాలు, దోష నివారణల పేరుతో డబ్బులు, నగలు లూటీ చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. అయితే, ఇక్కడ బాధితుడు తేరుకుని దొంగ బాబాలకు బడితె పూజ చేశాడు. అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగబాబాలు జనాలకు చిక్కారు. డబ్బులు, నగలు లూటీ చేయబోయి ప్రజల చేతిలో తన్నులు తిన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ లో దొంగ బాబాల హల్ చల్..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ లో దొంగ బాబాలు హల్ చల్ చేశారు. నస్కల్ గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 10వ తేదీన మధ్యాహ్నం గుజరాత్ రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో ముగ్గురు బాబాలు, ఓ డ్రైవర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వచ్చారు. అంతా కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, శ్రీధర్ వారిని డబ్బులు అడిగాడు. ఈ సమయంలో శ్రీధర్ చేతిని పట్టుకున్న దొంగ బాబాలు..నీకు దరిద్రం పట్టిందంటూ భయపెట్టారు. ఈ దరిత్రం పోవాలంటే శాంతిపూజలు చేయాలని నమ్మబలికారు.
రాగి చెంబులోని బంగారపు ఉంగరం మాయం..
ఇంట్లో రాగి చెంబు ఉంటే తీసుకు రావాలని సూచించారు. దొంగ బాబాల మాయమాటలు నమ్మేసిన శ్రీధర్ ఇంట్లోకి వెళ్లి పాత రాగి చెంబు తీసుకొచ్చారు. అందులో దొంగ బాబాలు నీళ్లు పోశారు. శ్రీధర్ చేతికి ఉన్న బంగారపు ఉంగరాన్ని రాగి చెంబులో వేశారు. పథకం ప్రకారం శ్రీధర్ ను ఇంట్లోకి పంపించారు. అతడు వచ్చేలోపు చెంబుకు తెల్లబట్ట కట్టారు. మరుసటి రోజు వరకు ఈ బట్టను విప్పొద్దని సూచించారు. అయితే, శ్రీధర్ కు అనుమానం వచ్చి బట్ట విప్పి చూడగా చెంబులో ఉంగరం బదులుగా రాయి ఉంది. దీంతో అతడు షాక్ తిన్నాడు. వెంటనే తేరుకుని ఇదేంటని ప్రశ్నించాడు. ఆ వెంటనే దొంగ బాబాలు శ్రీధర్ ని తోసేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో శ్రీధర్ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి వచ్చి దొంగ బాబాలకు బడితె పూజ చేశారు. గ్రామస్తులంతా కలిసి వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మోసగాళ్లతో జాగ్రత్త అంటున్న పోలీసులు..
ముగ్గురు నకిలీ బాబాలు, ఒక డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జనాలను మోసం చేసేందుకు వాడే పూజా సామాగ్రిని వాహనంలో గుర్తించారు. మీ దరిద్రం పొగడతామనో, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తామనో ఎవరినా చెబితే.. గుడ్డిగా వారి మాటలు నమ్మకండి. నమ్మారో అంతే సంగతులు. సర్వం కోల్పోవడం ఖాయం. మాయ మాటలతో జనాలను బురిడీ కొట్టించే ఇలాంటి కేటుగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వారి భరతం పట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read : నా జీవితాన్ని నాశనం చేశారు.. ఆ ఆరుగురే నా మరణానికి కారణం అంటూ.. విశాఖలో విషాదం