దేశంలో రోజుకు 87 అత్యాచార కేసులు.. 7శాతం పెరిగిన మహిళలపై నేరాలు..

Crimes in India-2019 : దేశంలో అత్యాచార నేరాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. 2019లో భారతదేశంలో అత్యాచార నేరాలకు సంబంధించి జాతీయ డేటా విడుదల అయింది.



ఈ డేటాలో దేశంలో ప్రతిరోజు (Rape Cases A Day) సగటున 87 అత్యాచార కేసులు నమోదుతున్నాయని వెల్లడించింది. 2019 ఏడాది సమయంలో మహిళలపై అత్యాచార నేరాలకు సంబంధించి 4,05,861 కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau) విడుదల చేసిన జాతీయ డేటా నివేదిలో పేర్కొంది.



Crimes in India -2019 నివేదిక ప్రకారం.. 2019 ఏడాదిలో మహిళలపై అత్యాచార నేరాలు 7.3 శాతానికిపైగా పెరిగిందని వెల్లడించింది. దేశంలో ఒక లక్ష మంది మహిళల్లో 2018లో 58.8 శాతంగా ఉన్న క్రైమ్ రేటు.. 2019లో 62.4 శాతం మేర క్రైమ్ రేటు పెరిగింది. 2018లో మహిళలపై నేరాలు 3,78,236 కేసులు నమోదయ్యాయినట్టు డేటా పేర్కొంది.

దేశవ్యాప్తంగా 2017లో 32,559 అత్యాచార నేరాలు నమోదు కాగా.. 2018 నాటికి 33,356 అత్యాచార నేరాలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. భారత పీనల్ కోడ్ (IPC) కింద నమోదైన చాలా మహిళలపై నేరాల్లో మేజార్టీ కేసులు భర్త క్రూరత్వం లేదా బంధువులు పాల్పడిన కేసులు 30.9 శాతం మేర నమోదయ్యాయి.



మహిళలపై దాడి (Crimes Against Women) కేసుల్లో 21.8 శాతం ఉండగా, కిడ్నాప్, మహిళలను ఎత్తుకెళ్లిన నేరాలు (17.9శాతం) నమోదైయ్యాయని NCRB డేటా 2019లో వెల్లడించింది. మహిళలపై మాత్రమే కాదు.. చిన్నారులపై కూడా నేరాల శాతం అధికంగా ఉందని NCRB పేర్కొంది. 2018 నుంచి చిన్నారులపై నేరాలు పెరుగుతూ 2019 నాటికి 4.5 శాతం మేర పెరిగాయని డేటా పేర్కొంది.



2019లో మొత్తంగా చిన్నారులపై జరిగిన నేరాలు 1.48 లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో 46.6 శాతం కిడ్నాపింగ్ కేసులు, లైంగిక నేరాల కింద 35.3 శాతం కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 53 మెట్రోపాలిటిన్ నగరాల్లోని నేరాల డేటాను NCRB సేకరించి విశ్లేషించింది.