పట్నాలోని ఒక ఇంజనీర్కు చేదు అనుభవం ఎదురైంది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన ఘటన చోటు చేసుకుంది.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. రెప్పపాటులో సొమ్మును పోగొట్టుకోవడం ఖాయం. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేసి బ్యాంక్ లావాదేవీలు చేస్తే…సైబర్ నేరగాళ్ల బారిన పడక తప్పదు. పట్నాలోని ఒక ఇంజనీర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన ఘటన చోటు చేసుకుంది. కోల్పోయిన తన సొమ్ము కోసం బాధితుడు బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
వివరాళ్లోకి వెళితే…సెప్టెంబర్ 10, 2019న సాఫ్ట్వేర్ ఇంజినీర్ విష్ణు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహార నాణ్యతపై సంతృప్తి చెందక దాన్ని తిరిగి పంపించేశాడు. ఇందుకు డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరగా..జొమాటో కస్టమర్ కేర్ను సంప్రదించమని… అందులోని మొదటి నంబరుకు ఫోన్ చేయమని.. డెలివరీ బాయ్ సలహా ఇచ్చాడు. దీంతో విష్ణు గూగుల్ సెర్చ్లోని జొమాటో కస్టమర్ కేర్ అని ఉన్న నంబరుకు ఫోన్ చేశాడు. వెంటనే జోమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. రూ.100 రిఫండ్ చేయాలంటే 10 అదనంగా డిపాజిట్ చేయాల్సి వుంటుందంటూ ఒక లింక్ను పంపాడు.
ఏ మాత్రం ఆలోచించకుండా ఇంజనీర్ వెంటనే లింక్పై క్లిక్ చేసి రూ.10 డిపాజిట్ చేశాడు. అంతే ఈ లావాదేవీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే విష్ణు బ్యాంక్ ఖాతాలోంచి సొమ్ము మొత్తం గల్లంతైంది. చూస్తూండగానే బహుళ లావాదేవీల ద్వారా 77 వేల రూపాయల మొత్తాన్ని అవతలి వ్యక్తి మాయం చేస్తోంటే.. విష్ణు అచేతనంగా మిగిలిపోయాడు. లబోదిబోమంటూ విష్ణు తన సొమ్మును వెనక్కి తెచ్చుకునే పనిలో పడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.