America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు
కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు.
- bheemraj
- Published On : April 10, 2023 / 10:06 PM IST
USA
America Shooting : అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఓ పోలీస్ అధికారి సహా ఆరుగురు గాయపడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.30 గంటలకు ఓల్డ్ నేషనల్ బ్యాంక్ మొదటి అంతస్థులోని మీటింగ్ హాల్ లో సాయుధుడు కాల్పులు జరిపాడు.
కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికాలో వరుసగా కాల్పులు జరుగుతున్నాయి.
America Shooting: అమెరికాలోని స్కూల్లో కాల్పుల మోత .. ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి
అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే కనీసం 15 కాల్పుల ఘటనలు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. లూయీస్ విల్లే ఘటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు కనీసం 146 కాల్పుల సంఘనలు చోటు చేసుకున్నాయి. తుపాకీ కాల్పుల ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలో మరెక్కడా కూడా లేనివిధంగా ప్రజలు ప్రతిరోజూ ఉదయం భయానక స్థితిలో మేల్కొంటున్నారని బ్రాడీ సెంటర్ ప్రెసిడెంట్ క్రిస్ బ్రౌన్ పేర్కొన్నారు. బ్యాంక్, పాఠశాల, సూపర్ మార్కెట్, చర్చ్.. ఇలా ఏదైనా అమెరికన్లు తమ కమ్యూనిటీల్లో సురక్షితంగా లేరని తెలిపారు. తుపాకీ తూటాలకు బలవుతామనే భయంతో జీవిస్తున్నారని చెప్పారు.
