Madhya Pradesh Ration scam
Madhya Pradesh Ration scam : మధ్యప్రదేశ్లో రేషన్ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. చాలా తెలివిగా వందకోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారు. లేని లబ్దిదారులను ఉన్నట్లుగా చూపించి ప్రజా ధనాన్ని తమ జోబుల్లో వేసుకున్నారు. ఈ స్కామ్ జరిగిన తీరు చూసి ఆడిటర్ జనరల్కే ఫీజులు ఎగిరిపోయాయి. రేషన్ తరలించిన వాహనాల నెంబర్లు చెక్ చేస్తే.. అవి బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్ల నెంబర్లుగా తేలాయి. ఇలా తిమ్మిని బమ్మిని చేసి వందకోట్లకు పైగా ప్రజా ధనాన్ని దొంగదారిన దోచుకుపోయారు.
ఎంత తెలివిగా వ్యవహరించినా.. మూడో కంటికి తెలియకుండా మాయం చేసినా.. ఎలాగోలా.. ఎప్పుడో ఒకప్పుడు బాగోతం బయటపడక మానదు.కాకపోతే మధ్యప్రదేశ్లో జరిగిన రేషన్ కుంభకోణం కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. 2018 నుంచి లెక్కలు తారుమారు చేసి.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించారు. పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందకుండా చేశారు. ఇన్నేళ్లకు ఈ మొత్తం కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదే ఇప్పుడు మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కార్ని కుదిపేస్తోంది. రేషన్ స్కామ్లో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు మొదటి నుంచి చాలా తెలివిగా వ్యవహరించారు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు.లెక్కలు తారుమారు చేయడం మొదలుకొని, రేషన్ తరలింపు వరకు అన్నింటి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. దొరికినంతా దోచుకున్నారు. ఇప్పుడు ఆడిటర్ జనరల్ నివేదిక పరిశీలిస్తే.. సుమారుగా వందకోట్లకు పై నిధులు దారి మళ్లినట్లు తెలుస్తోంది. ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తే ఈ విలువ వందల కోట్ల రూపాయలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వ పథకాల నిధులు ఎలా అవినీతి పరుల జోబుల్లోకి వెళ్తున్నాయో..? ప్రభుత్వాల్లో ఎంతమంది ఇంటి దొంగలు ప్రజధనాన్ని కాజేస్తున్నారో..? పైకి చూపించే లెక్కల వెనుక ఎంత అవినీతి దాగుందో..? తెలియజెప్పడానికి మధ్యప్రదేశ్ రేషన్ స్కామ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మారింది.
Also read : Madhya Pradesh Ration scam : మధ్యప్రదేశ్లో రేషన్ స్కామ్ ప్రకంపనలు .. Rs. 100కోట్లకు పైగా అవినీతి
ఆడిటర్ జనరల్ తనిఖీలు నిర్వహించిన 8 జిల్లాల్లో.. 2021కి గాను ఆరుగురు మిల్లర్ల ద్వారా రూ. 6.94 కోట్లు విలువ చేసే 1,125.64 మెట్రిక్ టన్నుల రేషన్ను తరలించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఆ రికార్డుల్లో పేర్కొన్న ట్రక్కుల వాహన రిజిస్ట్రేషన్ నంబర్, రవాణాశాఖ డేటా ఆధారంగా పరిశీలించిన ఆడిటర్ జనరల్కు ఫీజులు ఎగిరిపోయాయి. ఆ వెహికల్స్ నెంబర్లను ఆర్టీఏలో చెక్ చేయగా.. వాటిలో బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్ల నెంబర్లు కూడా ఉన్నట్లు తేలింది. ఎవరైనా రేషన్ బియ్యాన్ని ఇతర సరుకులను బైకుల్లో తరలిస్తారా ? ఇక్కడే తేలిపోయింది ఏ రేంజ్లో ప్రజాధనాన్ని దోచేసారన్నది..! అలాగే లబ్ధిదారుల సంఖ్యలోనూ భారీగా తప్పుడు లెక్కలు చూపినట్లు వెల్లడైంది. ఇక మధ్య ప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 9 వేల మంది 11 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసుగల బాలికలు బడి మానేశారని 2018లో విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే టీహెచ్ఆర్ పథకం అమలుకు డబ్ల్యూసీడీ అధికారులు ఎలాంటి సర్వే చేపట్టలేదు. కానీ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీల్లో ఏకంగా 36.08 లక్షల మంది బాలికలు ఉన్నట్లుగా చూపించారు. ఆడిటర్ జనరల్ చేసిన తనిఖీల్లో 8 జిల్లాల్లోని 49 అంగన్వాడీల్లో 63,748 మంది బాలికలు ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. వారిలో 29,104 మంది బాలికలకు క్రమం తప్పకుండా పోషక విలువలతో కూడిన రేషన్ను ఉచితంగా అందజేసినట్లు చూపించారు. నిజానికి అక్కడ ఉన్న బాలికల సంఖ్య కేవలం వందల్లోనే ఉంది. ఇలా తప్పుడు లెక్కలతో
2018 మొదలుకొని 2021 వరకు ఏకంగా 110 కోట్ల రూపాయలు దోచేశారని తేలింది.
రేషన్ స్కామ్లో రేషన్ ఉత్పత్తి ఖర్చును రూ. 58 కోట్లు పెంచి చూపడమే కాదు.. రూ. 62.72 కోట్ల విలువైన రేషన్ మాయమైనట్లు గుర్తించారు. కేవలం అధికారుల వల్లే ఇంత పెద్ద కుంభకోణం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వంలోని పెద్ద తలకాయల సహాయంతోనే ఈ కుంభకోణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తే.. అసలు ఎన్నికోట్లు దోచేశారు..ఇందులో ఎవరెవరి హస్తం ఉందనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందంటే.. ఈ పథకాల పేరుతో ప్రజలకు చేరేది పావలా అయితే..ప్రభుత్వ పెద్దలు దోచుకునేది రూపాయి పావలాగా ఉంది. రికార్డుల్లో తప్పుడు లెక్కల చూపించి అందరిని మాయ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాను గజదొంగల్లా కొల్లగొడుతున్నారు. పైకి సంక్షేమం అంటూ లోపల మాత్రం అంతా దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది చాలా మంచి పథకం. ఎంతో మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. కొందరైతే చనిపోతున్నారు. అలాంటి వారికి ఆదుకుని పౌష్టికాహారం అందిస్తుందనుకున్న పథకం ఇప్పుడు అవినీతి పథకంగా మారిపోయింది. అయితే.. వ్యాపం స్కామ్ అనుభవాన్ని బట్టి.. ఈ స్కామ్లోనూ దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం అయితే కలగడం లేదు.