Mob Forces Minor Girl To Get Sindoor Applied On Her Head By Dead Boyfriends Hand
West Bengal : పశ్చిమబెంగాల్ లో ఓ ప్రేమ జంట కధ విషాదాంతమైంది. ఈఘటనలో యువకుడి కుటుంబ సభ్యులు మూర్ఖంగా ప్రవర్తించారు. బర్ధమాన్ లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమ జంట వివాహం చేసుకోవాలనుకున్నారు. అందులో బాలిక మైనర్ కాగా యువకుడి వయస్సు 20 సంవత్సరాలు. ఈకారణంగా ఆమె తల్లి వారి ప్రేమపెళ్లిని అంగీకరించలేదు. దీంతో ప్రేమికులిద్దరూ పారిపోయి పెళ్లిచేసుకుని వచ్చారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది.
కుటుంబంలో జరుగుతున్న గొడవలకు మనస్తాపం చెందిన యువకుడు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం శవాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందచేశారు.
యువతి తల్లి కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడనే కోపంతో అతడి బంధువులు, కుటుంబ సభ్యులు కోపంతో శవాన్ని తీసుకుని ఆ యువతి ఇంటివద్దకు వచ్చి నిరసన తెలిపారు. చనిపోయే ముందు యువకుడు ఫోటోలు పంపినా యువతి తల్లి కాపాడేందుకు ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కనీసం తమకు సమాచారం ఇచ్చినా కాపాడుకునే వాళ్లమని ఆవేదన వెలిబుచ్చారు.
కోపంతో ఆ యువతిపై, ఆమె తల్లిపై దాడి చేశారు. తర్వాత బలవంతంగా యువతిని మృతదేహం వద్దకు తీసుకు వచ్చి బలవంతంగా ఆమె నుదుటిన మరణించిన యువకుడి వేలితో తిలకం దిద్దించారు. ఈ చర్య అక్కడ స్ధానికంగా ఉండే ఆచారంలో షాఖా-పలావ్ అంటారు. పోలీసులు షాఖా-పలావ్ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన కుమార్తె ఎదుర్కోన్న వేధింపులపై యువతి తల్లి సమీపంలోని మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.