మనుషుల్ని చంపడమంటే ఇష్టం ..సైకో కిల్లర్

వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్‌…  సొంత అన్నను హత్య చేయటానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. విచారణలో నిందితుడు హత్యలు చేయటానికి గల కారణాన్ని బయటపెట్టి పోలీసులను షాక్‌కు గురిచేశాడు . 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఫిబ్రవరి-4న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని  ఈటా జిల్లాలోని  ధర్మపుర్‌ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల బాలుడు  అనుమానాస్పదంగా  మరణించాడు. జూన్‌ 9న అతడి సోదరుడు ప్రశాంత్‌ కూడా అదే రీతిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

అయితే జూన్‌ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్‌ల చిన్నాన్న రాథే శ్యామ్(30)..‌సొంత అన్న విశ్వనాథ్‌ సింగ్‌ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు. అయితే ముందుగానే గుర్తించిన బంధువులు రాథే శ్యామ్‌ను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాథే శ్యామ్‌ను పోలీసులు తమ స్టైల్ లో విచారించారు . 

 పోలీసుల విచారణలో రాథే శ్యామ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. సత్యేంద్ర, ప్రశాంత్‌లను తానే చంపానని ఒప్పుకున్నాడు తనకు మనుషుల్ని చంపటం ఇష్టమని పోలీసుల విచారణలో రాథే శ్యామ్  తెలిపాడు. ఇంకా మరో ముగ్గుర్ని చంపటానికి కూడా ప్లాన్ చేసినట్లు  తెలిపాడని ఈటా ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం రోజు రాధేని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిజైలుకు తరలించినట్లు తెలిపారు.  కాగా, చిన్నారుల హత్య కేసులో అన్యాయంగా  జైలు పాలైన మహిళతో సహా  ముగ్గురిని  విడుదల చేసేందుకు పోలీసులు సన్నహాలు చేస్తున్నారు.