Teenager Suicide : పొరుగు వారింట్లో లో దుస్తులు దొంగిలిస్తూ ఓ టీనేజర్ దొరికిపోయాడు. దొరికిపోయానని భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోపాల్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ గాంధీనగర్లో నివసించే యువకుడు (17) శనివారం తన కజిన్ ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి పొరుగింటి వారికి చెందిన లో దుస్తులు దొంగిలించాడు. అవి దొంగిలిస్తుండగా చూసిన దంపతులు రవి, అతని భార్య యువకుడ్ని వెంబడించారు.
ఆయువకుడు పరిగెత్తుకుంటూ తన కజిన్ ఇంటికి వచ్చి తలుపు వేసుకున్నాడు. ఆ యువకుడు తప్పించుకుని పారిపోకుండా వారు ఆ గదికి బయట నుంచి గడియ పెట్టారు. ఈలోగా ఆయువకుడి కజిన్ను, పోలీసులను పిలిచారు. అంతా వచ్చాక గది తలుపులు తీసి చూడగా ఆ యువకుడు ఉరివేసుకుని కనిపించాడు.
అక్కడ ఉన్నలో దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దంపతులపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. దంపతులపై కేసు నమోదు చేసిన తర్వాతే మృతుడికి అంతిమ క్రియలు చేయటానికి అంగీకరించారు అతని బంధువులు.
కాగా… ఆ పరిస్ధితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారని తమ ఇంట్లో దొంగతనం జరిగితే ఎవరూ చూస్తూ ఊరుకోరని, దంపతులపై అన్యాయంగా కేసు నమోదు చేసారని దంపతుల బంధువులు వాపోయారు.