Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
- chvmurthy
- Published On : May 28, 2022 / 04:50 PM IST
Nalgonda Chariot
Nalgonda : నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామ శివారులో ఉన్న రామాలయంలో ఇటీవల రాముల వారి ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. అనంతరం ఆ రధం దేవాలయం దగ్గరే ఉంచారు. రథం ఇనుముతో చేసినది కావటం వలన.. వర్షానికి తుప్పు పడుతుందనే భావనతో శనివారం ఆ రథాన్ని రథశాలకు తరలించేందుకు కొందరు ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో సమీపంలో రథాన్ని తీసుకు వెళుతుంటే రథం 11కేవీ విద్యుత్తు తీగలను తాకింది. దీంతో విద్యుదాఘాతంతో కేతపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య (45), పొగాకు మోహన్(36), గుర్రంపూడ్ మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(26) అక్కడికక్కడే మరణించారు.
కేతపల్లికి చెందిన మరోవ్యక్తి రాజబోయిన వెంకటయ్యకు తీవ్రగాయాలు కావడంతో అతడిని 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై రజనీకర్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read : Kolkata : స్నేహితురాలి మరణంతో ఆత్మహత్య చేసుకున్న మోడల్..తల్లి షాకింగ్ కామెంట్స్
