Gun Firing : పులివెందులలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి

కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం నెలకొంది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్‌రెడ్డి గన్‌తో కాల్చి చంపి.. తర్వాత తాను కూడా గన్‌తో కాల్చుకొని చనిపోయాడు.

Gun Firing : కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం నెలకొంది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్‌రెడ్డి గన్‌తో కాల్చి చంపి.. తర్వాత తాను కూడా గన్‌తో కాల్చుకొని చనిపోయాడు. పాతకక్షల కారణంగానే ఈ హత్యజరిగినట్లు తెలుస్తోంది. హతులు ఇద్దరూ దాయాదులు అవుతారు. గ్రామంలో ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు.

ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పార్ధసారధి రెడ్డి కత్తితో ప్రసాద రెడ్డిపై దాడికి చేసేందుకు యత్నిస్తుండగా… ప్రసాద రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్ తో పార్ధసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు. పార్ధసారధి రెడ్డి శరీరంలోకి రెండు బుల్లెట్లు తగిలాయి. మూడో బుల్లెట్ లోడ్ చేసే లోగానే పార్ధసారధి రెడ్డి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన ప్రసాద్‌రెడ్డి అదే గన్‌తో కాల్చుకోని చనిపోయాడు.

మాజీ ఎంపీటీసీగా ఉన్నటువంటి ప్రసాదరెడ్డి గ్రామంలో పంచాయతీలు చేస్తూ గ్రామపెద్దగా పేరు పొందాడు. దాయాదిని కాల్చి చంపాడనే అపవాదు వస్తుందనే అవమాన భారంతో పశ్చాతాపం చెంది తాను కూడా కాల్చుకుని ఆత్నహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రసాదరెడ్డి కాల్చుకోగానే కొనఊపిరితో ఉన్నాడేమో అనే ఆశతో కుటుంబ సభ్యులు ఆయన్ను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు.

గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రసాదరెడ్డి, గతంలో పార్ధసారధి రెడ్డి కుటుంబం భార్యా భర్తల విషయంలో పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పంచాయతీలో తనకు అన్యాయం జరిగిందని భావించిన పార్ధసారధి రెడ్డి, శివప్రసాదరెడ్డిపై కక్ష పెంచుకుని ఈరోజు ఉదయం దాడిచేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తనను తాను రక్షించుకోటానికే శివప్రసాద రెడ్డి కాల్పులు జరిపినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది. పోలీసులు గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి శాంతిభద్రతలు పరిరక్షిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు