Wife And Husband: నవ వధువరులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రము మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకోగా.. భార్య ఆత్మహత్య కేసులో అరెస్టైన భర్త జైల్లో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే మైసూరు శ్రీరాంపుర ఎస్బీఎం కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్కు నంజనగూడు తాలూకా సరగూరు గ్రామానికి చెందిన ఆశారాణితో ఏప్రిల్ 4న వివాహం జరిగింది.
వివాహనం జరిగిన మరునాటి నుంచే అధిక కట్నం కోసం నవ వధువుకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో మే 3వ తేదీన ఆశారాణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆశారాణి తల్లిదండ్రులు కేసు పెట్టడంతో విచారణ చేపట్టిన పోలీసులు భర్త ప్రదీప్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు.
అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు తీర్పుతో కైలాసపురంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైలుకు తరలించారు. గురువారం అక్కడే బెడ్షీట్తో ప్రదీప్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.