CBSE Exam 2024 Results : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12 తరగతుల బోర్డు పరీక్షల ఫలితాలను మే మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలను విడుదల చేసిన తర్వాత, విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను యాక్సెస్ చేసేందుకు తమ రోల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఆపై అడ్మిట్ కార్డ్ ఐడీతో యాక్సస్ చేయొచ్చు.
సీబీఎస్ఈ ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు. బోర్డు పరీక్షల ఫలితాలు సాధారణంగా మే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. 2023లో, సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను మే 12, 2023న ప్రకటించింది. ఈ ఏడాది కూడా 10వ తరగతి ఫలితాలను మే మొదటి వారంలో రిలీజ్ చేయాలని బోర్డు భావిస్తోంది. కాగా, 12వ తరగతి ఫలితాలను మే రెండో వారంలో ప్రకటించవచ్చు. సీబీఎస్ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే.. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.
విద్యార్థులకు సంబంధించి మెరిట్ జాబితాను బోర్డు విడుదల చేయదు. సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను ఫిబ్రవరి 15, 2024 నుంచి మార్చి 13, 2024 వరకు నిర్వహించింది. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు నిర్వహించింది. ఈ ఏడాది 26 దేశాల నుంచి 39 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో 877 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, 5.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.