CBSE Board Exams : టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!

CBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

CBSE Board Exams : కొత్త జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. అంటే.. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆ ఏడాది నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

Read Also : UPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 ఫేజ్ 3 ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదిగో.. పూర్తివివరాలివే!

ఛత్తీస్‌గఢ్‌లో పీమ్ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీమ్ ప్రారంభించిన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. దాంతో రాష్ట్రంలోని దాదాపు 211 స్కూళ్లు అప్‌గ్రేడ్ కానున్నాయి. విద్యార్థులపై అకడమిక్ ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా 2020లో కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ఆవిష్కరించింది. 2025-26 అకడమిక్ సెషన్ నుంచి విద్యార్థులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం లభిస్తుందని మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు.

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడం, నాణ్యమైన విద్య లక్ష్యంగా :
10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను రెండుసార్లు రాయడం ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి నాణ్యమైన విద్యను అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. తద్వారా విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోరు కూడా సాధించడానికి వీలు కల్పిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఈ కొత్త విద్యా విధానంతో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ఫార్ములాగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు రాసిన రెండు పరీక్షల్లో ఎందులో ఎక్కువ స్కోరు వస్తే అదే ఆప్షనల్‌గా ఉంచుకోవచ్చునని మంత్రి ప్రధాన్ వెల్లడించారు.

ప్రతి సంవత్సరం పాఠశాలలో పది రోజులు పుస్తకాలు లేకుండా విద్యార్థులను ఇతర కార్యకలాపాలపై దృష్టిపెట్టేలా కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. అందులో కళ, సంస్కృతి, క్రీడలతో పాటు ఇతర కార్యకలాపాలతో విద్యార్థులను నిమగ్నం చేయాలనేది దీని ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ పథకం మొదటి దశలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో 211 స్కూళ్లు, (193 ప్రాథమిక స్థాయి, 18 సెకండరీ స్కూళ్లు) ఒక్కోదానికి రూ. 2 కోట్లు వెచ్చించి ‘హబ్ – స్పోక్’ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

రెండు లాంగ్వేజీల్లో.. ప్రాంతీయ భాష తప్పనిసరి :
గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF) ప్రకటించింది. దీని ప్రకారం.. బోర్డు పరీక్షలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు బాగా చదువుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. తద్వారా మంచి స్కోర్‌ను సాధించడానికి కూడా విద్యార్థులకు అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఇంటర్ విద్యార్థులకు రెండు లాంగ్వేజీలు కచ్చితంగా ఉండాలి. అందులో ఒకటి భారతీయ ప్రాంతీయ భాష తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. రెండు పరీక్షలను సెమిస్టర్ మాదిరిగా నిర్వహిస్తారా? లేదా సిలబస్ ఆధారంగా నిర్వహిస్తారా? అనేది క్లారిటీ లేదు.

Read Also : SSC JE 2024 Notification : జూనియర్ ఇంజనీర్ 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే? పూర్తివివరాలివే!

ట్రెండింగ్ వార్తలు