Telangana TET 2025 Final Results Update
తెలంగాణ టెట్ పరీక్షలు ముగిసినప్పటినుండి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల అవ్వగా వీటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు. దీంతో తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 22వ తేదీన ఫలితాలను ప్రకటించనుంది. దీనికి సంబందించిన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి కావటంతో దాదాపు అదే తేదీన విడుదల చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ఒకటి రెండు రోజుల తేడాలోనే ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇక టీఎస్ టెట్ 2025 ఎగ్జామ్ జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు జరిగింది. 16 సెషన్లలో ఈ టెట్ పరీక్షలు జరగగా పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా 47,224 మంది హాజరయ్యారు. పేపర్ 2 కి 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 కి గాను 41,207 మంది హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అందరూ తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.