×
Ad

UPPSC Prelims Exam : విద్యార్థుల డిమాండ్లతో దిగొచ్చిన యోగి సర్కార్.. ఒకే రోజున యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష!

UPPSC Prelims Exam : గత నాలుగు రోజులుగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో యోగి సర్కార్ దిగొచ్చింది.

  • Published On : November 15, 2024 / 10:52 PM IST

UPPSC Prelims Exam ( Image Source : Google )

UPPSC Prelims Exam : యూపీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) పరీక్షల విధానంపై వెనక్కి తగ్గింది. గత నాలుగు రోజులుగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో యోగి సర్కార్ దిగొచ్చింది. పలు రోజుల పాటు షిఫ్ట్‌లు వారీగా యూపీపీఎస్సీ పరీక్షలను నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకుంది.

ఈ మేరకు యూపీపీఎస్సీ కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఇప్పుడు, ఒకే రోజులో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (PCS) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు నిరసనలకు దిగడంతో యూపీ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) ప్రిలిమ్స్ పరీక్షను ఒకే రోజు నిర్వహించాలని నిర్ణయించింది. మొదట డిసెంబర్ 7, డిసెంబర్ 8 తేదీల్లో షెడ్యూల్ చేసిన పరీక్ష ఇప్పుడు డిసెంబర్ 22, 2024న జరుగనుంది.

పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటిది ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, రెండవది మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతుంది. ప్రయాగ్‌రాజ్‌లోని యూపీపీఎస్సీ కార్యాలయం వెలుపల వందలాది మంది విద్యార్థుల నిరసనల తర్వాత షెడ్యూల్‌ను సవరించాలనే నిర్ణయం వచ్చింది. విద్యార్థులు గత బహుళ-రోజుల పరీక్ష ఫార్మాట్ గురించి ఆందోళనలకు దిగారు. ఇది అన్యాయమని, అసమానతలకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల నిరసనల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకుని విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలని యూపీపీఎస్సీని ఆదేశించారు. షెడ్యూల్ మార్పు వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయి. రివ్యూ ఆఫీసర్/అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ (ప్రీ) పరీక్షకు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల సమస్యలను పూర్తిగా పరిష్కరించామని డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి డిమాండ్లు నెరవేర్చామని పాఠక్ అన్నారు.

Read Also : DOGE Vacancy : వారానికి 80 గంటల పని, సూపర్ హై ఐక్యూ, జీతం లేకుండా పనిచేసేవారు కావాలి : డోజ్ శాఖ