హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. పొల్యూషన్కు చెక్ పెట్టే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాలం చెల్లిన వాహనాలు, కాలుష్యం వెదజల్లే
పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. పొల్యూషన్కు చెక్ పెట్టే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాలం చెల్లిన వాహనాలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై నజర్ పెట్టింది. కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నిరంతర కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కాలంచెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్భన ఉద్గారాల కారణంగా స్వచ్చమైన గాలి కలుషితమవుతోందన్నారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లుచీటి పాడాలని ఆదేశించారు.
Also Read : నిఖా పేరుతో దోపిడీ : లక్షలు ముంచేసిన నైజీరియన్
అటవీ, పర్యావరణ, ఎస్ అండ్ టీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాలుష్యాన్ని వెదజల్లి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంత నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చాస్తోందని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. జీవకోటికి ప్రాణాధారం నీరని… అది పుష్కలంగా ఉండాలంటే పర్యావరణ సమతుల్యం తప్పనిసరి అన్నారు. సీయం కేసీఅర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారుల అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : అందరికీ కాదు : మార్చి 8న సెలవు
ముంబయి తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు చేపడతామన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధం ఉన్నా…. విచ్చల విడిగా ప్లాస్టిక్ బ్యాగులను కంపెనీలు తయారు చేస్తున్నాయని… అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.