చీటింగ్ కేసులో రవి ప్రకాష్ అరెస్ట్

  • Publish Date - October 5, 2019 / 12:34 PM IST

Tv9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. టీవీ9 సంస్థ బ్యాంకు అకౌంట్ల నుంచి అక్రమంగా రూ. 18 కోట్ల నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం కంప్లయింట్ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 5వ తేదీ ఉదయం రవిప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుదీర్ఘంగా విచారించిన అనంతరం నిధుల దారి మళ్లింపునకు సంబంధించి వివరాలు రాబట్టారు. TDS పేరుతో 11.75 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. అనంతరం రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం రవి ప్రకాశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

రవి ప్రకాశ్, మూర్తిలపై నిధుల మళ్లింపు ఆరోపణలు వచ్చాయని, అలంద మీడియా ఫిర్యాదు మేరకు రవి ప్రకాశ్‌ను విచారించినట్లు వెస్ట్ జోన్ ఇంఛార్జీ డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు. డైరెక్టర్ల అనుమతి లేకుండా నిధులను సొంత అకౌంట్లలోకి మళ్లించారని, ఇందులో రవి ప్రకాశ్‌తో పాటు మూర్తి కూడా ఉన్నారన్నారు. బోనస్, ఎక్స్ గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేశారని వెల్లడించారు. ఏడాది కాలంలో రూ. 18 కోట్లు నిధుల మళ్లింపు జరిగిందన్నారు. ఈ నిధులు ఏం చేశారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం రవి ప్రకాశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

రవిప్రకాశ్, మూర్తిపై సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. టీవీ9 నిధులను బోర్డు సభ్యులకు తెలియకుండా మళ్లించటంపై ప్రశ్నించారు. రూ.18 కోట్ల రూపాయల వరకు అక్రమంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆధారాలతో సహా కంప్లయింట్ చేసింది టీవీ9 యాజమాన్యం. అనంతరం ఈ విషయంపై పోలీసులు అరెస్ట్ చేశారు. 

చెక్ పవర్ దుర్వినియోగం చేసినట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త యాజమాన్యం రికార్డులు తనిఖీలు చేస్తుండగా ఈ మోసం వెలుగు చూసింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు అనుమతి లేకుండా నిధులు డ్రా చేసినట్లు కొత్త యాజమాన్యం గుర్తించింది. క్లి ఫోర్డ్ పెరీరాకు అక్రమంగా…రూ. 5.97 కోట్ల బోనస్‌ను రవి ప్రకాశ్ జారీ చేసినట్లు తెలిసింది. 2017-18, 2018-19లో ఏబీసీఎల్‌కు వచ్చిన లాభాలకు సరిపడా నిధులను అక్రమంగా రవిప్రకాశ్‌, మూర్తిలు తీసుకున్నారని, సెప్టెంబర్‌ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య మూడు సార్లు బోనస్‌ల పేరిట డబ్బు డ్రా చేసినట్లు తనిఖీల్లో బయటపడింది. 

2018 ఆగస్టులో ఏబీసీఎల్‌లో 90.54 శాతం షేర్లను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. ఏబీసీఎల్‌ యాజమాన్య హక్కులు పూర్తిగా అలంద మీడియావే. అలంద మీడియా అనుమతి లేకుండా రవిప్రకాశ్‌, మూర్తిలు అక్రమంగా బోనస్‌ తీసుకున్నట్లు, బోనస్‌గా ఇచ్చినట్లు రికార్డుల్లో రాయమంటూ రవిప్రకాశ్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. 

రవిప్రకాశ్‌ అక్రమంగా తీసుకున్న డబ్బు
18.09.2018న రూ.1,80,00,000
11.03.2019న రూ.1,56,00,000
08.05.2019న రూ.3,00,00, 000
మొత్తం రూ.6,36,00,000
ఎంకేవీఎన్‌ మూర్తి అక్రమంగా తీసుకున్న డబ్బు
24.10.2018 & 10.12.2018న – రూ.3,97,87,500
08.05.2019న – రూ.2,00,00,000
మొత్తం రూ.5,97,00,000
Read More : పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్