మేము సైతం : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తామంటున్న అమ్మాయిలు

ఏపనికైనా ఓ పద్ధతుంటుంది. ఆ పద్ధతి ప్రకారమే చేయాలి. ముఖ్యంగా ట్రాఫిక్ లో నిబంధనలు పాటించకపోవటం వల్లనే పలు ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు పక్కన నడిపే వాహనదారులకు కూడా ఇబ్బందికరమే. ఇదిలా ఉంటే మరోపక్క ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవటంలో యువతులు కూడా ఉండటం విశేషం. నేటి ఆధునిక యువతులు అన్నింటా తామే అన్నట్లుగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో మహిళల ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ప్రాంతాలలో ఎక్కువగా జరగుతున్నట్లుగా తెలుస్తోంది.
సైబరాబాద్ ఐటీ కారిడార్లో 1000 ఐటీ సంస్థల్లో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 30-40శాతం మంది మహిళే కావటం విశేషం. ఈ క్రమంలో ఉద్యోగాలలోనే కాక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలో కూడా యువతులు మేమున్నామంటున్నారు.వాస్తవానికి పురుషులతో పోల్చితే మహిళలు సమన్వయం పాటిస్తుంటారు. కానీ ట్రాఫిక్ నిబంధనల విషయంలో మాత్రం యువతులు అబ్బాయిలను మించిపోతున్నారని తెలుస్తోంది.
అలాగే డ్రంకెన్ డ్రైవ్ లో కూడా అమ్మాయిలు పోలీసులకు దొరికిపోవటం..పోలీసులతో వాగ్వాదానికి దిగటం వంటి ఘటనలు తరచు జరుగుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి.. తదితర ప్రాంతాల్లో పబ్లు ఎక్కువగా ఉండటంతో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు అక్కడికి వెళ్తున్నారు. తిరుగు ప్రయాణాల్లో ట్రాఫిక్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు. అంతేకాదు టూ వీలర్స్ నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోకపోవటం..వెహికల్స్ కు నంబర్ ప్లేట్స్ కూడా లేకండా డ్రైవ్ చేయటం, సిగ్నల్ జంపింగ్ చేయడం, స్టాప్ లైన్లను కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు దొరికితే వారితో కూడా వాగ్వాదాలు పెట్టుకుంటున్నారు.
గతంలో కాకుండా ఇప్పుడు టెక్నాలజీ వినియోగంతో ప్రతీ సిగ్నల్ వద్దా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో ఎవ్వరు తప్పించుకునేందుకు వీలు లేదు. చిటికెలో దొరికిపోతున్నారు. దీంతో అందరు మూడో కంటిలో నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అంతేకాదు సివిల్ డ్రస్ లతో ప్రయాణిస్తు ట్రాఫిక్ పోలీసులు తమ సెల్ ఫోన్లతో కూడా ఫోటోలు తీస్తు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ శాతంమంది యువతులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.