Ukraine Without Electricity: రష్యా యుద్ధం మిగిల్చిన చీకటి.. యుక్రెయిన్లో కరెంట్ లేక అల్లాడుతున్న కోటి మంది ప్రజలు
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ యుక్రెయిన్లోని కీలక ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటి మంది ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు.
- Narender Thiru
- Published On : November 18, 2022 / 06:26 PM IST
Ukraine Without Electricity: యుద్ధం తర్వాతి పరిణామాలు ఏ దేశానికైనా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా నష్ట పోయిన దేశాన్ని అనేక సమస్యలు చుట్టుముడతాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది యుక్రెయిన్.
Elon Musk: ఎలాన్ మస్క్ మాట్లాడుతుండగా.. మీటింగ్ నుంచి వెళ్లిపోయిన ట్విట్టర్ ఉద్యోగులు
ప్రస్తుతం ఈ దేశం యుద్ధ ఫలితాల్ని అనుభవిస్తోంది. అక్కడి కోట్లాది మంది ప్రజలు కనీస విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం వెల్లడించారు. ఇటీవల యుక్రెయిన్లో విద్యుత్ రంగం లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి, రవాణా కేంద్రాల్ని ధ్వంసం చేసింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేదు. ఫలితంగా దాదాపు కోటి మందికి పైగా ప్రజలు చీకట్లోనే ఉంటున్నారని జెలెన్స్కీ చెప్పారు. అయితే, సరఫరా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అక్కడి ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. యుక్రెయిన్లో చమురు ఉత్పత్తి కేంద్రాలపై రష్యా దాడులు చేసింది. దీంతో చమురు ఆధారిత విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా జరుపుకొని రష్యా చేసిన దాడుల్లో పలువురు సాధారణ ప్రజలు కూడా మరణించారు. భారీ సంఖ్యలో గాయపడ్డారు. ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే జరిగింది.
