×
Ad

Worlds Longest Train Journey: 18వేల కిలోమీటర్లు, 21 రోజులు, 13 దేశాలు.. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే

స్థానిక సంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు. అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించొచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఎగ్జైట్ మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Worlds Longest Train Journey: భారత్ లో అతి పొడవైన రైలు మార్గం అంటే దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్. దీని గురించి చాలా మందికి తెలుసు. ఇది దాదాపు 80 గంటల 15 నిమిషాల్లో 4వేల 273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. దాదాపు 55 స్టేషన్లలో ఆగుతుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా? గతంలో లండన్ నుండి సింగపూర్ వరకు రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డ్ కలిగుంది.

ఇప్పుడు, ఆ రికార్డును పోర్చుగల్ నుండి సింగపూర్ మార్గం బద్దలు కొట్టింది. ఈ అద్భుతమైన ప్రయాణం.. దూరం గురించి మాత్రమే కాదు.. అనేక రకాల సంస్కృతులు తారసపడతాయి. ప్రకృతి దృశ్యాలు మైమరిపిస్తాయి. ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.

ఈ రైలు నమ్మశక్యం కాని రీతిలో 18వేల 755 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తి ప్రయాణానికి దాదాపు 21 రోజుల సమయం పడుతుంది. అయితే.. ప్రతికూల వాతావరణం, ఇతర ఊహించని జాప్యాల కారణంగా ఈ ప్రయాణం కొన్నిసార్లు మూడు వారాల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు.

ఈ అద్భుతమైన రైలు ప్రయాణం పోర్చుగల్‌లోని అల్గార్వే ప్రాంతంలోని అందమైన పట్టణం లాగోస్‌లో ప్రారంభమై సింగపూర్‌లో ముగుస్తుంది. రైలు 13 వేర్వేరు దేశాల మీదుగా వెళ్తుంది. 11 ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ ప్రయాణం ప్రపంచంలోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలుపుతుంది.

ఈ మార్గంలో స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలు ఉన్నాయి. పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ వంటి ప్రసిద్ధ నగరాల్లో స్టాప్స్ ఉన్నాయి. ఈ ప్రధాన స్టాప్‌లలో ప్రతిదానిలోనూ రైలు రాత్రిపూట బస చేస్తుంది. తద్వారా ప్రయాణీకులు నగరాలను అన్వేషించవచ్చు. స్థానిక సంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు. అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించొచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఎగ్జైట్ మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జీవితంలో ఒక్కసారే లభించే ఈ ప్రయాణానికి టికెట్ ధర దాదాపు USD 1,350 (సుమారు రూ. 1.14 లక్షలు). ఇది ఖరీదైనదిగా అనిపించినప్పటికీ, 13 దేశాలకు ప్రయాణం, అన్ని ముఖ్యమైన సేవలు ఇందులో ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా సహేతుకమైనది. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత భోజనం, పానీయాలు, వసతితో సహా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రయాణికులు అదనపు ఖర్చుల గురించి చింతించకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించొచ్చు.

ఈ మార్గంలో కీలకమైన భాగం చైనా, లావోస్ మధ్య కొత్త రైలు మార్గం. ఇది చివరకు యూరప్, ఆసియాను రైలు ద్వారా అనుసంధానించింది. మరపురాని ప్రయాణ అనుభవాన్ని సృష్టించడమే కాకుండా, ఈ మార్గం లావోస్ వంటి దేశాలలో వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచడానికి దోహదపడుతుంది.

Also Read: బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక ఈ బీరు దొరకడం కష్టమే..!