బంగ్లా ప్రధానిగా 17న తారిక్ రహమాన్ ప్రమాణం.. మోదీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు ఎందుకు లేవంటే?
ఆహ్వానిత దేశాల్లో భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ ఉన్నాయి.
- 13 దేశాల ప్రభుత్వాధినేతలకు ఆహ్వానం
- చైనా, సౌదీ, పాకిస్థాన్, టర్కీ నేతలకు కూడా
- అదే రోజు ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ భేటీ!
Tarique Rahman: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షుడు, ఆ దేశ రాజకీయాల్లో ఒకప్పుడు “డార్క్ ప్రిన్స్”గా గుర్తింపు పొందిన తారిక్ రహమాన్ నేతృత్వంలో ఈ నెల 17న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆయన ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం బంగ్లాదేశ్ పార్లమెంటు భవనం దక్షిణ ప్రాంగణంలో జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంపై దక్షిణాసియా అంతటా దృష్టి సారించింది. ఆహ్వానిత దేశాల్లో భారత్ ప్రధాన దేశం.
బీఎన్పీ వర్గాల ప్రకారం.. మొదట కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత అదే రోజు కొత్త ప్రధానమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తారిక్ రహమాన్తో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్ ప్రమాణం చేయిస్తారు.
బీఎన్పీ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 17ను బంగ్లాదేశ్కు చారిత్రాత్మక రోజుగా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమవుతుందని తెలిపారు. ఢాకాకు అంతర్జాతీయ నాయకులు రావడం ప్రత్యేకతను సంతరించుకుంటుందని చెప్పారు.
ముఖ్య దౌత్య చర్యలో భాగంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ 13 దేశాల ప్రభుత్వాధినేతలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆహ్వానిత దేశాల్లో భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందినా, అదే రోజు ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా హాజరు కావడం కష్టమని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ భారత్ తరఫున హాజరయ్యే అవకాశం ఉంది.
