రాజీనామా చేసి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన బంగ్లా ప్రధాని.. బంగ్లాదేశ్‌లో సైనిక పాలన: ఆర్మీ చీఫ్

తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆమె బెంగాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా చేసి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన బంగ్లా ప్రధాని.. బంగ్లాదేశ్‌లో సైనిక పాలన: ఆర్మీ చీఫ్

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ అధికారికంగా ప్రకటించారు. తమ దేశంలో సైనిక పాలన ఉంటుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కూడా కృషి చేస్తామని తెలిపారు.

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు మరింత పెరిగాయి. మృతుల సంఖ్య 300కు చేరింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకుని వెళ్లారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

దీంతో రాజీనామా చేసి ఢాకా ప్యాలెస్ వీడి షేక్ హసీనా సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆమె బెంగాల్ లేదా ఫిన్లాండ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. బంగబాబన్ నుంచి మిలిటరీ హెలికాప్టర్లో ఆమె బయలుదేరారు. ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. రిజర్వేషన్ల సవరణ ఆందోళనలతో నెల రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వాహనాలను తగలబెడుతున్నారు ఆందోళనకారులు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితులు చేజారి పోయాయి.

Also Read: వయనాడ్ ఘటన.. కన్నీరు పెట్టిస్తున్న కుక్క వీడియో