Bomb Blast In Pakistan: పాకిస్థాన్లోని వజీరిస్థాన్లో బాంబు పేలుడు.. వ్యాన్లో ప్రయాణిస్తున్న 11 మంది కార్మికులు మృతి
పాకిస్థాన్లోని ఉత్తర వజీరిస్థాన్ గుల్మిర్కోట్ ప్రాంతంలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. 11మంది కార్మికులు మరణించారు.
- Harishth Thanniru
- Updated on- August 20, 2023 / 12:21 PM IST
Bomb Blast In Pakistan
Pakistan Bomb Blast : పాకిస్థాన్లో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఉత్తర వజీరిస్థాన్లోని గుల్మిర్కోట్ ప్రాంతంలో వ్యానులో వెళ్తున్న కార్మికులు టార్గెట్గా ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగిందని పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర వజీరిస్థాన్లోని వ్యాన్లో బాంబు పేలినట్లు వారు తెలిపారు.
ఉత్తర వజీరిస్థాన్ ఇప్పటికే భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న ప్రదేశం. అయితే, తాజా ఘటన ఉగ్రవాదుల పనేనని డిప్యూటీ కమిషనర్ రెహన్గుల్ ఖట్టక్ తెలిపినట్లు పాక్ మీడియా పేర్కొంది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని టార్గెట్గా ఈ పేలుడు జరిపినట్లు పేర్కొన్నారు. కార్మికులంతా ఆర్మీ పోస్ట్లో పనిచేస్తున్నారు. అయితే, ఈ బాంబు పేలుడు ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. పేలుడులో మరణించిన బాధితులు దక్షిణ వజీరిస్థాన్లోని మాకిన్, వానా తహసీల్లకు చెందిన వారని పాక్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది.
Pakistan Bomb Blast : పాకిస్థాన్లో బాంబు పేలుడు, ఇద్దరు పోలీసులతో సహా పలువురు మృతి
బజౌర్లో జరిగిన పెద్ద ఆత్మాహుతి పేలుడు తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో 23 మంది చిన్నారులతోపాటు 63 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 200 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తాజాగా ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో బాంబు పేలుడు ఘటనలో గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ బాంబు పేలుడు ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి రానున్నాయి.
