Bus Accident : ఇటలీలో ఘోర బస్సు ప్రమాదం…21 మంది మృతి
ఇటలీ దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారు. వెనిస్లో మీథేన్తో నడుస్తున్న బస్సు వంతెనపై నుంచి కింద పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా 21 మంది మరణించారు...
- saleem sk
- Published On : October 4, 2023 / 05:33 AM IST
Bus Accident
Bus Accident : ఇటలీ దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారు. వెనిస్లో మీథేన్తో నడుస్తున్న బస్సు వంతెనపై నుంచి కింద పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా 21 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. మా నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదం అలముకుందని మేయర్ లుయిగి బ్రుగ్నారో ఫేస్బుక్లో రాశారు. ‘‘ఈ బస్సు ప్రమాద ఘటనలో 21 మరణించగా, మరో 20 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు’’ అని వెనిస్ ప్రాంత గవర్నర్ లూకా జైయా చెప్పారు.
మృతదేహాలను వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని గవర్నర్ తెలిపారు. బాధితులు,క్షతగాత్రుల్లో ఇటాలియన్లు మాత్రమే కాకుండా పలు దేశాల ప్రజలు ఉన్నారు. బస్సు వెనిస్లోని చారిత్రాత్మక కేంద్రం నుంచి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర ఇటాలియన్ నగరంలోని మెస్ట్రే, మర్గెరా జిల్లాలను కలుపుతూ రైలు మార్గాన్ని దాటుతున్న వంతెనపై నుంచి బస్సు వస్తుండగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Also Read : Bandaru Satyanarayana : టీడీపీ నేత బండారు సత్యనారాయణకు ఊరట, బెయిల్ మంజూరు, న్యాయం ధర్మం గెలుస్తుందని కామెంట్
ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బస్సు విద్యుత్ లైన్లకు తగలడంతో ప్రమాదం జరిగిందని ఇటలీ అధికారులు చెప్పారు. 2018 జులైలో 50 మంది హాలిడే మేకర్స్తో నేపుల్స్కు వెళుతున్న బస్సు నగరానికి సమీపంలో ఉన్న ఒక వయాడక్ట్ నుంచి కింద పడటంతో 40 మంది మరణించారు.
