Chinese Man : మా ప్రభుత్వం మమ్మల్ని వదిలేసింది.. నేను ఎలా బతికేది.. యుక్రెయిన్లో చిక్కిన చైనా యువకుడి ఆవేదన!
రష్యా బలగాలు యుక్రెయిన్ నగరాల్లోకి దూసుకొచ్చి బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. చైనా ప్రభుత్వం కొందరిని సురక్షితంగా యుక్రెయిన్ నుంచి తమ దేశానికి తరలించింది.
- Sreehari A
- Published On : March 7, 2022 / 03:54 PM IST
Chinese Man Govt Abandoned Us, How Do I Survive, Asks Chinese Man Stranded In Ukraine
Chinese Man stranded in Ukraine : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ నగరాల్లోకి దూసుకొచ్చి బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని విదేశాలయుంతా తమ దేశ ప్రభుత్వాలు, రాయభారి కార్యాలయం సాయంతో స్వదేశానికి సురక్షితంగా చేరుకుంటున్నారు. భారత్ సహా చాలా దేశాలు తమ పౌరులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు యూరప్లో విధ్వంసానికి గురైన యుక్రేనియన్ నగరం చెర్నిహివ్కు సమీపంలో రష్యన్ బలగాలు మోహరించాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుటి నుంచి సుమారు 6వేల మంది చైనీస్ జాతీయులు చిక్కుకున్నారు. చైనా ప్రభుత్వం కొందరిని సురక్షితంగా యుక్రెయిన్ నుంచి తమ దేశానికి తరలించింది. చైనా జాతీయుల్లో 25ఏళ్ల యువకుడు అక్కడే ఉండిపోయాడు. తనను కూడా రక్షించమని ఆ యువకుడు యుక్రెయిన్ లోని రాయబారి కార్యాలయాన్ని కోరాడు. అందుకు చైనా రాయబారి కార్యాలయం తాము చేయలేమని చేతులేత్తేసింది. నీ ప్రాణాలు నువ్వే కాపాడుకోవాలని బాధితుడికి చెప్పేసింది. తన దేశ ప్రభుత్వం తనను నిస్సహాయంగా వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మనం ఎదుర్కొంటున్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని, అందుకు ఒక మార్గాన్ని మీరు కనుగొని ప్రాణాలను కాపాడుకోండి అని చైనా రాయబారి కార్యాలయం చెప్పినట్టు బాధిత యువకుడు వాపోయాడు.
తనకు ఎటు వెళ్లాలో రష్యా బలగాల నుంచి ఎలా తన ప్రాణాలను కాపాడుకోవాలో పాలుపోలేదు. చివరికి అక్కడి యుక్రెయిన్ స్థానిక కుటుంబం అతడికి ఆశ్రయం కల్పించింది. యుక్రెయిన్ అంతటా యుద్ధం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏమి చేయలేమని చెప్పడం మానవత్వం కాదని వాపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జాతి పౌరుడిని కాపాడుకోవడం జాతి బాధ్యత కాదా? అని చైనా WeChat మెసేజింగ్ యాప్ ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చాడు. యుక్రెయిన్, రష్యా దాడుల నేపథ్యంలో తమ జాతీయులను విడిచిపెట్టమని పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి.
కానీ, చైనా మాత్రం తమ జాతీయులను కాపాడుకునే విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. యుద్ధం ప్రారంభమయ్యే వరకు చైనా అలానే వేచి చూసింది. సన్నిహిత మిత్రదేశమైన మాస్కో చర్యలను కూడా ఖండించలేదు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ జాతీయుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. మొన్నటివరకూ యుక్రెయిన్ నుంచి 3,000 మందికి పైగా చైనా పౌరులను సురక్షితంగా తరలించడానికి సాయం చేసినట్టు తెలిపింది. యుక్రెయిన్లో చిక్కుకున్న నిర్వాసితులను మొదటి రెండు విమానాల్లో చైనాకు చేరుకున్నట్టు రాష్ట్ర మీడియా వెల్లడించింది.
Read Also : Russia Ukraine War : శాంతి యుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి- జెలెన్స్కీ కి సూచించిన ప్రధాని మోదీ
