మోదీకి ఫోన్ చేసి బెదిరిస్తే 5 గంటల్లో యుద్ధం ఆపేశారు… ట్రంప్ మరో బాంబు.. లేకపోతేనా..

ఘర్షణల సమయంలో ఏడు యుద్ధవిమానాల కంటే ఎక్కువే కూలాయని ట్రంప్ చెప్పారు. 150 మిలియన్‌ డాలర్ల విలువైన విమానాలు కుప్పకూలాయని తెలిపారు. 

Donald Trump

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న ఘర్షణలను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనంతటతానే ప్రకటించుకున్నారు. తాజాగా, ట్రంప్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య అణు యుద్ధం సంభవించే పరిస్థితులను తానే అడ్డుకున్నానని చెప్పారు. తాను మొదట భారత్‌తో, ఆ తర్వాత పాకిస్థాన్‌తో మాట్లాడానని తెలిపారు.

వైట్‌ హౌస్‌లో కేబినెట్‌ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. “నేను భారతదేశానికి చెందిన టెర్రిఫిక్ మ్యాన్‌ మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో ఏం జరుగుతోంది? అని అడిగాను. ఆ తర్వాత నేను పాకిస్థాన్‌తో వాణిజ్యంపై మాట్లాడాను.

భారతదేశంతో ఏం జరుగుతోంది? అని పాక్‌ను అడిగాను. ఆ ఇరు దేశాల మధ్య ఇటువంటి పరిస్థితులు చాలా కాలంగా, వివిధ పేర్లతో కొనసాగుతున్నాయి” అని అన్నారు.

Also Read: Heavy Rains: దంచికొట్టిన వర్షం.. మూడు రోజులు ఇక ఇంతే.. ఈ జిల్లాలకు అలర్ట్‌ జారీ..

“ఏం జరుగుతోంది? అని నేను అడిగాను. నేను వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేనని చెప్పాను. ఇరు దేశాలు అణు యుద్ధానికి దిగుతాయని చెప్పాను. ఇదే జరిగితే ఆ రెండు దేశాలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోమని చెప్పాను.

ఆ దేశాలపై భారీ ఎత్తున సుంకాలు (టారిఫ్‌లు – దిగుమతులపై పన్నులు) వేస్తామని చెప్పాను. దీంతో సుమారు ఐదు గంటల్లో యుద్ధం ముగిసింది. ఇప్పుడు మళ్లీ మొదలవుతుందేమో, నాకు తెలియదు.

నా అభిప్రాయం ప్రకారం మొదలు కాదు. కానీ అది మొదలైతే నేను ఆపుతాను. ఇలాంటి ఘర్షణలు జరగనీయలేం” అని అన్నారు.

ఘర్షణల సమయంలో ఏడు యుద్ధవిమానాల కంటే ఎక్కువే కూలాయని ట్రంప్ చెప్పారు. 150 మిలియన్‌ డాలర్ల విలువైన విమానాలు కుప్పకూలాయని తెలిపారు.

భారత్ – పాకిస్థాన్‌ యుద్ధం అణు యుద్ధ స్థాయికి వెళ్లేదని ట్రంప్ చెప్పారు. భారత్‌-పాక్ యుద్ధాన్ని కొనసాగిస్తే ఎలాంటి వాణిజ్యం చేయబోమని చెప్పామని ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ఆపడానికి తాను వాణిజ్యాన్ని వాడానని తెలిపారు.