Tuvalu: ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశం తువాలు.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా బలయ్యే తొలి దేశం కూడా!
భవిష్యత్తులో దేశం ఎలాగూ ఉండదు.. కనీసం తువాలు సంస్కృతి, సంప్రదాయాలైన కనుమరుగు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి పాలకులు. దీని కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశంగా తువాలును మార్చారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 24, 2023 / 01:41 PM IST
Global warming impact on Tuvalu country
Tuvalu Country: పర్యావరణ కాలుష్యం పెరిగిపోవడం.. గ్లోబల్ వార్మింగ్ (Global warming) కారణంగా రోజురోజుకు వాతావరణంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. అతివృష్టి, వరదల (Floods)తో ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు భూతాపంలో మార్పుల కారణంగా సముద్రమట్టాలు (Sea Level) పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరగడం వల్ల కొన్ని దేశాలు సైతం కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాంటి వాటిలో ఒకటే తువాలు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మొదట బలికాబోతున్న దేశం ఇదే అని అంటున్నారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న అతి పెద్ద సమస్య
గ్లోబల్ వార్మింగ్… ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అతి పెద్ద సమస్య. మానవుడు తన సౌకర్యం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి ప్రతిఫలమే గ్లోబర్ వార్మింగ్. దీని వల్ల ఇప్పుడు వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడంతో పాటు సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ద్వీప దేశమైన తువాలు త్వరలో అదృశ్యం కానుంది.
సముద్ర జలాలను లీజుకు ఇవ్వడమే ఆదాయ వనరు
పసిపిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా.. హవాయిల మధ్య తొమ్మిది దీవుల సమూహంగా ఉన్నదే తువాలు దేశం. ఇక్కడి జనాభా 12 వేలు. ఇప్పటికే సముద్ర మట్టం పెరగడంతో తువాలు 40 శాతం సాగరంలో కలిసిపోయింది. ఇది ఇలానే కొనసాగితే ఈ దశాబ్ధం చివరికి గ్లోబల్ వార్మింగ్ కారణంగా బలయ్యే తొలి దేశం తువాలే అవుతుంది. సముద్ర జలాలను లీజుకు ఇవ్వడమే ఈ దేశ ప్రధాన ఆదాయ వనరు. ఏం కావాలన్న ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తువాలుకు కావాల్సిన మౌలిక వసతులు ఆస్ట్రేలియా కల్పిస్తోంది.
మెటావర్స్లో తువాలు దేశం డిజిటల్ రూపం
భవిష్యత్తులో దేశం ఎలాగూ ఉండదు.. కనీసం తువాలు సంస్కృతి, సంప్రదాయాలైన కనుమరుగు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి పాలకులు. దీని కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశంగా తువాలును మార్చారు. మెటావర్స్లో తువాలు దేశం ఎలా ఉంటుందో డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని అంటున్నారు తువాలు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్ కోఫే.
Also Read: అపార్ట్మెంట్ బాల్కనీలో ఆవుల్ని పెంచుతున్న యజమాని.. ఎన్నో ఫ్లోర్లోనో తెలుసా..?
ప్రస్తుతం తాత్కాలికంగానైనా తువాలును కాపాడుకోవడానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సహకారంతో చర్యలు చేపడుతున్నారు. కృత్రిమంగా ద్వీపాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఈ పనులు తాత్కాలికమే అంటున్నారు అక్కడి ప్రజలు. రాబోయే రోజుల్లో తమ దేశం కనుమరుగుకాక తప్పదని ఆవేదన చెందుతున్నారు.
Also Read: ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్ వెళ్లన భారతీయ మహిళ.. తర్వాత ఏం జరిగింది?
