ఇరాన్‌ నిరసనల్లో భారతీయులు అరెస్టయ్యారా? నిజం ఇదే..

ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని, ఇప్పటికే 500 మందికి పైగా మృతి చెందారని కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌ నిరసనల్లో భారతీయులు అరెస్టయ్యారా? నిజం ఇదే..

Iran protests (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 9:10 AM IST
  • ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు, హింస
  • ఆరుగురు భారతీయులు అరెస్టు అంటూ వార్తలు
  • ఆ వార్తలు పూర్తిగా అసత్యం అని చెప్పిన ఇరాన్ దౌత్యవేత్త 

Iran: ఇరాన్‌లో నిరసనలు, హింస కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులు కూడా అరెస్టయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఇరాన్ పోలీసులు ఆరుగురు భారతీయ పౌరులను అరెస్టు చేశారన్న కథనాలను భారత్‌లోని ఇరాన్ రాయబారి ఖండించారు. విశ్వసనీయ సోర్సుపై మాత్రమే ఆధారపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇరాన్ దౌత్యవేత్త మొహమ్మద్ ఫతాలీ ఎక్స్‌లో దీనిపై స్పందిస్తూ.. “ఇరాన్ పరిణామాలపై కొన్ని విదేశీ ఎక్స్ ఖాతాల్లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అసత్యం. విశ్వసనీయ సోర్సులు ఇచ్చే వార్తలను మాత్రమే చూడాలని కోరుతున్నాను” అని అన్నారు.

Also Read: Pranam Project: వృద్ధుల కోసం డే కేర్‌ సెంటర్లు.. ఎలా పనిచేస్తాయంటే?

డొనాల్డ్ ట్రంప్ ఏం చేయనున్నారు?
ఇరాన్‌ ప్రభుత్వం నిరసనకారులను అణచివేసేందుకు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంలీడర్‌ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని, ఇప్పటికే 500 మందికి పైగా మృతి చెందారని కథనాలు వెలువడ్డాయి.

దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌పై సైనిక చర్యలు తీసుకోవాలా? అన్న అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. అయితే, నిరసనకారులను రక్షించేందుకు అమెరికా బలప్రయోగం చేస్తే తాము యూఎస్‌, ఇజ్రాయెల్‌పై ప్రతీకారదాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది.