Japan Population : పిల్లలను కంటే రూ.3లక్షలు నజరానా.. ఆఫర్ అదిరిపోయింది కదూ. పిల్లలను కనే తల్లిదండ్రులకు రూ.3లక్షలు నజరానాగా ఇస్తామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. అయితే, ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ పనిలో ఉంటాం అని తొందర పడొద్దు. ఎందుకంటే ఈ ఆఫర్ ఇచ్చింది మన ప్రభుత్వం కాదు.. జపాన్ ప్రభుత్వం.
జపాన్ లో యువత జనాభా బాగా తగ్గిపోయింది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారింది. నానాటికి తగ్గిపోతున్న యువత జనాభా వ్యవహారం జపాన్ ప్రభుత్వాన్ని చాలా కాలంగా ఆందోళనకు గురి చేస్తోంది. తగ్గిపోతున్న జననాల రేటు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకా ఊరుకుంటే లాభం లేదని నిర్ణయించిన జపాన్ ప్రభుత్వం.. జనాభాను పెంచే పనిలో పడింది.
Also Read..Free Condoms : కండోమ్స్ ఉచితం.. దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం, కారణం ఇదే.
ఇందులో భాగంగా పిల్లలను కనేలా ప్రజలను ప్రేరేపించడానికి చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. పిల్లలను కనాలనుకునే దంపతులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న నజరానా మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. పిల్లలను కనే దంపతులకు గతంలో రూ.2.50లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు దాన్ని రూ.3లక్షలకు పెంచారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
నిజానికి.. పిల్లలను కనాలనుకునే జంటకు ఆర్థిక సాయాన్ని గతంలోనే జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ప్రజల ఆలోచనా తీరులో మార్పు రాకపోవడంతో గతంలో ప్రకటించిన మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచింది.
పిల్లలను కనేందుకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి మొత్తాన్ని జపాన్ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం జపాన్లో బిడ్డ పుడితే రూ.2.50 లక్షలకు పైగా ఆర్థిక సాయం బిడ్డ తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఇప్పుడు దాన్ని రూ.3 లక్షలకు పెంచారు. ఇది 2023 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. జపాన్ లో డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒక్కో డెలివరీకి రూ.2.60 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
గతేడాది జపాన్లో మొత్తం 8లక్షల 11వేల 604 మంది పిల్లలు పుట్టగా, ఆ ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 14 లక్షలకుపైగా ఉంది. ఇక జపాన్లో 100ఏళ్లు దాటిన వారి సంఖ్య 86 వేలు దాటింది. వీరిలో 88 శాతం మంది మహిళలు ఉన్నారు. జపాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 లో జపాన్లో అత్యల్ప సంఖ్యలో పిల్లలు పుట్టారు. దాంతో ప్రభుత్వం యువత జనాభా పెరుగుదల కోసం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. జనాభా పెరుగుదల ఆవశ్యకతపై పెళ్లైన జంటలకు అవగాహన కల్పించింది ప్రభుత్వం. అయినప్పటికీ జనాభా పెరుగుదలలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పిల్లలను కనే తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఆ మొత్తాన్ని పెంచింది.
చూడాలి మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలితం ఇస్తుందో. పాపం జపాన్ ప్రభుత్వం.. జననాల రేటు పెంచేందుకు నానా తంటాలు పడుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. నగదు ప్రోత్సాహకం పెంపుతో జంటల్లో మార్పు వస్తుందని, ఎక్కువ మంది పిల్లలను కంటారని ఎన్నో ఆశలు పెట్టుకుంది.