20 మంది అమర జవాన్ల స్మృతికి చిహ్నంగా ‘న్యూ వార్ మెమోరియల్’
- Sreehari A
- Published On : October 3, 2020 / 09:44 PM IST
New war memorial : భారత్, చైనా సరిహద్దుల్లో డ్రాగన్ బలగాలతో జరిగిన ఘర్షణలో పోరాడి అమరులైన భారతీయ జవాన్ల స్మృత్యర్థం న్యూ వార్ మెమోరియల్ నిర్మించారు. లడఖ్లోని వ్యూహాత్మక రహదారి Durbuk-Shyok-Daulat Beg Oldieలోని KM-120 పోస్ట్ సమీపంలో ఈ మెమోరియల్ నిర్మించారు. స్మారక చిహ్నంపై 20 మంది సైనికుల పేర్లతో పాటు జూన్ 15 నాటి ఆపరేషన్ వివరాలను పొందుపరిచారు.
మెమోరియల్ వాల్ పై ఏమని లిఖించారంటే.. 15 జూన్, 2020న గాల్వాన్ లోయ వద్ద కల్నల్ బి సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని 16 బిహార్ క్విక్ రియాక్షన్ ఫోర్స్ చైనా దళాలను Y Nala నుంచి విజయవంతంగా తొలగించి పెట్రోలింగ్ పాయింట్ 14కు చేరుకుంది. భారత సైనికులకు, PLA దళాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ ఘర్షణలో భారీ ప్రాణనష్టం కలిగింది. ఇరవై గాలంట్స్ ఆఫ్ గాల్వన్ బలిదానం సాధించింది అని రాసి ఉంది.
వాస్తవానికి ఈ ఘర్షణలో చైనా సైన్యమే ఎక్కువ ప్రాణనష్టానికి గురైంది.. కానీ, చైనా మాత్రం ఎలాంటి వివరాలను బయటపెట్టలేదు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్- మే నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫింగర్ ఏరియా సహా గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, కాంగ్ రంగ్ నాలా వంటి పలు ప్రాంతాల్లో చైనా ఆర్మీ అతిక్రమణకు పాల్పడింది.
ఈ ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రమై జూన్ నెలలో గాల్వన్ లోయలో చైనా, భారత జవాన్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి విధితమే.
