మారని పాక్ వక్రబుద్ధి…ధీటుగా జవాబిచ్చిన భారత్

దాదాపు నాలుగు నెలలుగా ప్రపంచ దేశాలన్నీ కోవిద్-19 మహమ్మారిఫై యుద్ధం చేసున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు శాయశక్తులా  ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ సంక్షోభం బయటపెట్టిన వ్యవస్థల్లోని లోపాలను చక్కబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కానీ, మన దాయాది దేశం పాకిస్థాన్‌ మాత్రం ‘కుక్క తోకర వంకర’ అన్న చందంగానే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. సొంత దేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పక్కనబెట్టి  ఎప్పటిలాగే భారత్‌పై అసత్య  ఆరోపణలు చేస్తూనే ఉంది.  

మంగళవారం   జెనీవా లోన్ జరిగిన 43వ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) సెషన్ లో మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి పాకిస్తాన్ తన‌ వక్రబుద్ధిని చాటుకున్న‌ది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న‌దంటూ అర్థంలేని ఆరోపణలు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న మానవహక్కుల సంక్షోభాన్ని ప్రస్తావించి, దాని పరిష్కారాలపై చర్చించాల్సిన వేదికను రాజకీయం చేసేందుకు ప్ర‌య‌త్నించింది. 

అయితే, పాకిస్థాన్ ఆరోప‌ణ‌ల‌ను భారత్‌ దీటుగానే తిప్పికొట్టింది. పాక్‌ వైఖరిని ఉదాహరణలతో స‌హా వివ‌రిస్తూ ఎండగట్టింది. UNHRC వేదిక‌ను దుర్వినియోగం చేయ‌డ‌మ‌నే సంప్ర‌దాయాన్ని పాకిస్థాన్ ఇప్పుడు కూడా కొన‌సాగించింద‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదటి  సెక్రటరీ విమర్ష  ఆర్యన్ విమ‌ర్శించారు. దక్షిణాసియా దేశాల్లో నరమేధాన్ని ప్రోత్సహిస్తున్న ఏకైక దేశమైన పాకిస్థాన్‌.. మానవహక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయ‌న దుయ్యబట్టారు. 

సంకుచిత రాజకీయ అజెండా కోసం UNHRC లాంటి అంతర్జాతీయ వేదికలను వాడుకోవడం ప్రమాదకర‌మ‌ని హెచ్చ‌రించారు. కిడ్నాప్‌లు, మతమార్పిళ్లు, హత్యలు, ఉగ్రవాద క్యాంపులకు అడ్డాగా మారిన ఓ దేశం భారత్ లాంటి సహజ శాంతియుత దేశానికి నీతులు చెప్పడం సరికాదన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త‌ర‌చూ జ‌రుగుతున్న దాడుల గురించి కూడా ప్ర‌స్తావించారు. వారు [పాకిస్తాన్] వారి మైనారిటీల పట్ల సహనం మరియు పొరుగువారి పట్ల మంచిని  పాటించాలి, తద్వారా దక్షిణాసియా ప్రాంతం శాశ్వత శాంతిని చూస్తుందని విమర్ష  ఆర్యన్ అన్నారు.