Qatar: హర్మూజ్ జలసంధి బంద్.. సముద్ర ప్రయాణాలపై ఖతార్ లాక్డౌన్.. ఉత్కంఠలో గల్ఫ్ దేశాలు!
ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశమైన ఖతార్(Qatar) తన ప్రజా భద్రత దృష్ట్యా అత్యవసర నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- July 12, 2026 / 10:15 PM IST
Qatar issued orders to suspend its maritime operations due to Iran missile attacks
- పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం
- ఖతార్పై ఇరాన్ క్షిపణుల దాడి
- సముద్ర లాక్డౌన్ విధించిన ఖతార్
Qatar: ఇరాన్, ఇజ్రాయెల్ ల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశమైన ఖతార్ తన ప్రజా భద్రత దృష్ట్యా అత్యవసర నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వాణిజ్య, విహార నౌకలతో పాటు చేపల వేట బోట్ల సముద్ర ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నౌకల యాజమాన్యాలను ఆదేశించింది.
దోహాపై క్షిపణి దాడులు: ఖతార్ దీటుగా స్పందన:
పరిస్థితిని మరింత తీవ్రం చేస్తూ ఖతార్ (Qatar)రాజధాని దోహా లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులలో కొన్నింటిని ఖతార్ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. అయితే ఈ దాడుల వల్ల కొందరు పౌరులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏ రకమైన విపత్కర పరిస్థితులనైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు తమ సైనిక దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని ఖతార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరాన్ చర్యలపై ఒమన్ తీవ్ర ఆగ్రహం:
మరోవైపు ఇరాన్ వ్యవహారశైలిపై పొరుగు దేశం ఒమన్ నిప్పులు చెరిగింది. అమెరికా స్థావరాలను టార్గెట్ చేసే నెపంతో తమ భూభాగంపై ఇరాన్ బాంబులు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇరాన్ రాయబారికి సోషల్ మీడియా వేదికగా ఒమన్ ప్రభుత్వం నిరసన తెలిపింది. హర్మూజ్ జలసంధి వివాదంపై ఇరాన్ విదేశాంగ అధికారితో ఒమన్ చర్చలు జరిపిన మరుసటి రోజే.. ఇరాన్ చర్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటూ ఒమన్ తీవ్ర విచారం వ్యక్తం చేయడం గమనార్హం.
