Indians: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. భారతీయుల ఇబ్బందులు?

తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా సైనికుల శిక్షణ శిబిరంలోనే దాదాపు 100 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరందరినీ..

Russia Ukraine war

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా.. సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇందులో గెలిచేదవరు ? ఓడేదెవరు ? అన్న విషయాలను పక్కన పెడితే.. వేలాది మంది సాధారణ పౌరులతో పాటు సైనికులు మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయితే.. రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తున్న భారతీయులు పడుతున్న ఇబ్బందులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించింది.

2022 ఫిబ్రవరి 24 నుంచి సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది రష్యా. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇరువైపులా వేలాది మంది సాధారణ పౌరులతో పాటు సైనికులు మృతిచెందారు. దాదాపు కోటి మంది ఉక్రేనియన్లు నిర్వాసితులుగా మారగా.. ఇందులో 60 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లిపోయారు.

అయితే రష్యా దాడుల వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయిపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇదే సమయంలో రష్యాకు చెందిన లక్షా 80 వేల మంది సైనికులు మృతిచెందినట్లు తెలిపారాయన. ఉక్రెయిన్‌లో వేలాది మంది సాధారణ పౌరులు చనిపోయారన్న ఆయన.. ఆ సంఖ్య చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.

మరోవైపు అమెరికా సహా పలు దేశాలు మాత్రం 70 వేల మంది ఉక్రెయిన్ సైనికులు, రష్యాకు చెందిన 40 వేల మంది మృతిచెంది ఉంటారని అంచనా వేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ప్రపంచ దేశాలపై పడింది. రెండు దేశాల నుంచి వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి.

అవన్నీ అవాస్తవాలే..
ఈ యుద్ధంలో రష్యా సైన్యానికి సహాయకులుగా ఉన్న భారతీయులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై భారత విదేశాంగ తీవ్రంగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసిన MEA.. మాస్కోలోని భారత ఎంబసీ దృష్టికి వచ్చే అలాంటి ప్రతి కేసుపై అధికారులతో చర్చిస్తున్నామని ప్రకటించింది.

ఇప్పటికే చాలా మంది భారతీయులను అక్కడి నుంచి వెనక్కి తీసుకువచ్చామని.. రష్యా సైన్యం నుంచి భారతీయులందరినీ త్వరలో విడుదల చేయిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓ భారతీయ హెల్పర్‌ మృతిచెందారు. రష్యా ఆక్రమిత ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హెమిల్ అశ్విన్‌భాయ్ మంగుకియా అనే 23 ఏళ్ల వ్యక్తి కన్నుమూశారు. అయితే.. హమీల్‌ తుపాకీ కాల్చడానికి ట్రైనింగ్‌ తీసుకుంటుండగా… ఈ ఘటన జరిగినట్లు అక్కడే ఉన్న మరో హెల్పర్‌ తెలిపారు. అయితే.. హేమిల్‌ మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

అయితే.. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా సైనికుల శిక్షణ శిబిరంలోనే దాదాపు 100 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరందరినీ తమ స్వస్థలాలకు చేర్చాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read Also: ఐరన్, కాల్షియం సప్లిమెంట్లను కలిపి తీసుకోకూడదంటారు.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు