Uganda
Tragedy In Uganda : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఉగాండాలో విషాదం చోటు చేసుకుంది. 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు ఫ్రీడమ్ సిటీ మాల్లో గుమ్మికూడారు. బాణసంచా కాల్చే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవటంతో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.
Uganda: రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసిన హిప్పో.. అయినా బతికిన చిన్నారి.. ఎలా జరిగిందంటే
ఈ ఘటనపై ఉగాండా పోలీస్ ఫోర్స్ ఒక ట్వీట్ చేసింది. ఫ్రీడమ్ సిటీమాల్ నమసుబాలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కాట్వే టెరిటోరియల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాట సమయంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర భద్రతా సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కరోనా ఆంక్షల సడలింపుతో మూడేళ్ల తరువాత నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం ఆ దేశంలో ఇదే తొలిసారి. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు షాపింగ్ మాల్కు చేరుకోవటం, బాణాసంచా పేలుడు సమయంలో తొక్కిసలాట జరగడంతో ప్రాణాలు కోల్పోయారు.