India Pak Ceasefire: కశ్మీర్ సమస్య పరిష్కారంకోసం.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర వుందన్న ట్రంప్ .. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యానికి తహతహలాడుతున్నారు.
- Harishth Thanniru
- Published On : May 11, 2025 / 11:01 AM IST
Donald Trump
India Pak Ceasefire: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించడంతో సరిహద్దుల్లో ప్రశాంతవాతావరణం నెలకొంది. అయితే, తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెందు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్.. కాశ్మీర్ అంశంపై కీలక ప్రస్తావన చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.. ‘‘ ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్ప ఏమీలేవని భారత్, పాకిస్థాన్ లోని శక్తివంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. ఇరుదేశాలు కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికా భాగస్వామ్యం ఉండటం నేను గర్విస్తున్నాను. ఈ రెండు గొప్ప దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. అంతేకాదు.. వెయ్యి సంవత్సరాల తరువాత కాశ్మీర్ సమస్య విషయంలో ఒక పరిష్కారంకు రావడానికి అమెరికా ఆ రెండు దేశాలతో కలిసి పనిచేస్తుంది.’’ అని ట్రంప్ పేర్కొన్నాడు.
Truth Social
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర వుందన్న ట్రంప్ .. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యానికి తహతహలాడుతున్నారు. అయితే, కాశ్మీర్ పై ద్వైపాక్షిక చర్చలే తమ విధానమని మూడో పార్టీకి సంబంధం లేదని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కాల్పుల విరమణకు పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ప్రతిపాదన చేశారని, మరొకరి పాత్ర లేదని భారత్ ఇప్పటికే పేర్కొంది.
