Assam-Meghalaya Border: అసోం-మేఘాలయ సరిహద్దులో అటవీ అధికారుల కాల్పులు.. ఐదుగురు మృతి
అసోం-మేఘాలయ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేఘాలయకు చెందిన వ్యక్తుల్ని సరిహద్దులో అటవీ శాఖ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
- Narender Thiru
- Published On : November 22, 2022 / 04:08 PM IST
Assam-Meghalaya Border: అసోం మేఘాలయ సరిహద్దులో దారుణం జరిగింది. అసోం అటవీ అధికారులు జరిపిన కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనపై మేఘాలయాలో ఆవేశం పెల్లుబుకుతోంది. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్తితులు తలెత్తకుండా అధికారులు ఇక్కడ ఇంటర్నెట్ నిలిపివేయించారు.
ఐదు దశాబ్దాలుగా అసోం-మేఘాలయ మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884 కిలోమీటర్లకు సంబంధించిన సరిహద్దుపై వివాదం ఉంది. ఈ విషయంపై సరిహద్దు ప్రాంతాల్లో అనేక సార్లు గొడవలు జరిగాయి. పరిస్తితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, ఈ ఏడాది మార్చిలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సరిహద్దు విషయంలో సమస్య పరిష్కారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా దీనికి అంగీకరించారు. దాదాపు 70 శాతం వివాదాస్పద భూమిపై ఒక నిర్ణయానికి వచ్చారు. మిగతా సరిహద్దుపై చర్చలు జరగాల్సి ఉంది. అయినప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయకు చెందిన కొందరు వ్యక్తులు సరిహద్దు ప్రాంతం నుంచి కలప తీసుకెళ్తున్నారు.
ఇది గమనించిన అసోం అటవీ శాఖ అధికారులు కలప తీసుకెళ్తున్న వాహనాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. ఈ సమయంలో తలెత్తిన గొడవలో ఒక అటవీ శాఖ అధికారి కూడా మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై మేఘాలయ సీఎం స్పందించారు. ఉన్నతాధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై అసోం ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. కాల్పుల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్తితి తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేశారు.
