BJP National Meet: రేపటి నుంచి బీజేపీ జాతీయ సదస్సు.. వర్చువల్గా హాజరుకానున్న మోదీ
మూడు రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభం కానుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు.
- Narender Thiru
- Published On : May 18, 2022 / 08:02 PM IST
Bjp National Meet
BJP National Meet: మూడు రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభం కానుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పార్టీకి చెందిన కీలక నేతలంతా హాజరవుతారు.
మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యనిర్వహణ కార్యదర్శులు అంతా కలిపి దాదాపు 136 మంది వరకు హాజరుకానున్నారు. 20వ తేదీ శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ మీటింగ్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని పటిష్టం చేసే అంశాలపై చర్చిస్తారు. అలాగే మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి, ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబోయే ఉత్సవాల గురించి కూడా చర్చిస్తారు.
Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
కాగా, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, దీనికి కేంద్రాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు అరుణ్ సింగ్ విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నఅరుణ్ సింగ్ కూడా గురువారం సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. ఇటీవలే ఉదయ్పూర్లో కాంగ్రెస్ చింతన్ శివిర్ ముగియడంతో, తాజాగా బీజేపీ కూడా జాతీయ సదస్సు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
