Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని, కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు.
- Narender Thiru
- Published On : May 26, 2022 / 02:59 PM IST
Chandrababu Nadidu
Chandrababu Naidu: పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని, కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు. గురువారం మహానాడుకు బయలుదేరిన చంద్రబాబు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కోనసీమ ఘటనపై స్పందించారు.
Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
‘‘కోనసీమలో వైసీపీనే చిచ్చుపెట్టింది. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ కూడా రాలేదు. వాళ్ల ఇళ్లను వాళ్లే తగులబెట్టుకుని వేరేవాళ్లపై నిందలు వేస్తున్నారు. తప్పులు చేసి, ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగన్కు అలవాటుగా మారింది. ప్రభుత్వాన్ని నడపడం జగన్కు సాధ్యం కాదు. మధ్యంతరానికి జగన్ సిద్ధపడుతున్నారు. టీడీపీ.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. మా కార్యకర్తలెవరూ జగన్కు భయపడరు. జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా? మహానాడుకు బస్సులివ్వకుండా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారు. ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా? జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి. నడిచైనా, ఎడ్లబళ్లల్లోనైనా మహానాడుకు రండి. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’.. ఇదే మహానాడు నినాదం. ఆ వర్గమైనా బాగున్నారా? ఏ ఒక్క వర్గం బాగుందన్నా తిరిగి అమరావతికి వెళ్లిపోతా. వైసీపీలో సామాజిక న్యాయం ఎక్కడుంది? ఉత్తరాంధ్రపై, రాయలసీమపై ప్రేమ లేదు. అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించ లేదు.
PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే
విశాఖ మీద ప్రేముందని, రాజధాని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి రాజ్యసభ స్థానాలు ఎందుకు కేటాయించలేదు? తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారు. మంత్రులు ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేపడతారు? ఎస్సీలకు చెందిన 28 స్కీములు రద్దు చేశారు. డబ్బులున్న వాడికి ఊడిగం చేస్తూ, పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. దావోస్కు వెళ్లి అదానీ, గ్రీన్కోతో ఒప్పందాలు చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్కోతో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు కొనసాగించరా? వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు దీనికి వ్యతిరేకంగా పోరాడితే కేసు నమోదు చేశారు. అనంతబాబు వ్యవహరంలో వైసీపీని ప్రజలు ఛీ కొట్టారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
