Independence Day Celebrations: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..
స్వాతంత్ర్య అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అసేతు హిమాచలం సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ నుంచి మారుమూల గ్రామం దాకా వీధివీధి జెండా పండుగకు ముస్తాబయ్యాయి.
- Harishth Thanniru
- Published On : August 15, 2022 / 07:10 AM IST
Independence Day
Independence Day Celebrations: స్వాతంత్ర్య అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అసేతు హిమాచలం సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ నుంచి మారుమూల గ్రామం దాకా వీధివీధి జెండా పండుగకు ముస్తాబయ్యాయి. పతాకావిష్కరణ కార్యక్రమాలకు కోట్లాది మంది దేశవాసులు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట వద్ద జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గోనున్నారు. ఇప్పటికే ఎర్రకోట వేడుకలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
75th Independence Day: జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి.. లేకుంటే కఠిన శిక్షలు..
పంద్రాగస్టు వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7:06 గంటలకు మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్ఘాట్లో పూలమాలలు వేస్తారు. ఉదయం 7:14 గంటలకు రాజ్ఘాట్ నుంచి ఎర్రకోటకు బయలుదేరుతారు. 7:18 గంటలకు లాహోరీ గేట్కు వెళ్లి ఆర్ఎం, ఆర్ఆర్ఎం, డిఫెన్స్ వందనాలు తీసుకుంటారు. 7:20 గంటలకు ఎర్రకోట వద్ద గౌరవ గార్డ్ నిర్వహిస్తారు. 7:30 గంటలకు ప్రధాన మంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలుకుతారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొంటారు.
75th Independence Day: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు.. భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు..
అయితే ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి అంగన్వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, ముద్రా పథకం రుణాలు తీసుకున్నవారు ఈ వేడుకలలో వారి పాత్రను గుర్తించడానికి ప్రత్యేక ఆహ్వానాలు అందించారు. జాతీయ జెండాను ఆవిష్కరింపజేయడానికి ప్రధానమంత్రి మోదీతో పాటుగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల నుండి ఒక్కొక్క అధికారి, 20 మంది పురుషులు ఉంటారు. ఈ సేవను వైమానిక దళం సమన్వయం చేస్తోంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కూడా హాజరుకానున్నారు.
ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరణ సమయంలో 20మంది సభ్యులతో కూడిన ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ “రాష్ట్రీయ సెల్యూట్”ను అందజేస్తుంది. రెండు MI-17 1V హెలికాప్టర్లు “అమృత్ ఫార్మేషన్”లో పూల వర్షం కురిపిస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
