PT Usha: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష.. ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా రికార్డు
పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. ఐఓఏ చరిత్రలో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళగా నిలవనున్నారు.
- Narender Thiru
- Published On : November 28, 2022 / 07:37 PM IST
PT Usha: పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష అరుదైన ఘనత సాధించనున్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా నిలవనున్నారు. ఐఓఏ సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ఆదివారమే నామినేషన్లకు తుది గడువు.
Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన భార్య
కాగా, ఇందులో అధ్యక్ష పదవికి పీటీ ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేష్ల ప్రక్రియ పూర్తి కావడం.. పీటీ ఉష మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో ఐఓఏ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా పీటీ ఉష నిలుస్తారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళా పీటీ ఉషనే. అలాగే మహరాజా యాదవేంద్ర సింగ్ తర్వాత ఈ పదవి చేపట్టనున్న తొలి క్రీడాకారిణిగా కూడా ఉష నిలవనున్నారు. అయితే, అసోసియేషన్కు సంబంధించి మిగతా పదవులకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పోస్టులకు మొత్తం 24 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అందులో పీటీ ఉష టీమ్ నుంచి 14 మంది నామినేషన్ వేశారు. ఇక ఐఓఏ ఉపాధ్యక్ష పదవి (పురుషుల విభాగం) కోసం మాజీ షూటర్ గగన్ నారంగ్ ఒక్కడే నామినేషన్ వేశారు.
దీంతో ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నిక ఏకగ్రీవమే. ఇక మహిళల విభాగానికి సంబంధించిన ఉపాధ్యక్ష పదవి కోసం రాజలక్ష్మి సింగ్, అలకనంద అశోక్ పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్, వెటరన్ ఆర్చర్ డోలా బెనర్జీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. కాగా, కేరళకు చెందిన పీటీ ఉష అనేక అంతర్జాతీయ వేదికలపై భారత సత్తా చాటారు. 1984లో జరిగిన లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల పరుగు హార్డిల్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. అనేక ఆసియా గేమ్స్లో బంగారు పతకాలు సాధించారు.
